తొండి సంజయ్.. నాలుక చీరేస్తాం బిడ్డా... ఖబడ్దార్... ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ వార్నింగ్...
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల నేపథ్యంలో ఓరుగల్లు రాజకీయం హీటెక్కుతోంది.రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఓరుగల్లులో అడుగుపెట్టడంతో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. అధికార పార్టీపై,ముఖ్యమంత్రి కేసీఆర్పై ఆయన చేసిన వ్యాఖ్యలతో మాటల యుద్దానికి తెరలేచింది. కేసీఆర్ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందంటూ సంజయ్ విమర్శలు చేయడంతో టీఆర్ఎస్ నుంచి కౌంటర్ మొదలైంది. తాజాగా ప్రభుత్వ చీఫ్ విప్,ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ బండి సంజయ్పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఖబడ్డార్ అంటూ ఆయన్ను హెచ్చరించారు.
Recommended Video
నాలుక చీరేస్తాం బిడ్డా... : వినయ్ భాస్కర్ వార్నింగ్
తమ అధినేత కేసీఆర్పై నోరు పారేసుకుంటే నాలుక చీరేస్తాం బిడ్డా.. అంటూ వినయ్ భాస్కర్ బండి సంజయ్ని హెచ్చరించారు. బండి సంజయ్ని తొండి సంజయ్ అంటూ ఎద్దేవా చేశారు. ఎన్నికలు రాగానే సంజయ్కు చార్మినార్,భద్రకాళి ఆలయం గుర్తొస్తుందని... వరంగల్లో వరదలు వచ్చిన సమయంలో వీళ్లంతా ఎక్కడున్నారని ప్రశ్నించారు. కేసీఆర్ పిలుపు మేరకు వరదల సమయంలో తాము విస్తృతంగా పర్యటించి వరద బాధితులను ఆదుకున్నామని చెప్పారు. వరంగల్ నగరానికి కేంద్రం చేసిన అభివృద్ది ఏమిటో,ఇచ్చిన నిధులెంతో చెప్పాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రానికి సంజయ్ ఏం తీసుకొచ్చాడు : వినయ్ భాస్కర్
గల్లీ నుంచి ఢిల్లీకి పోయిన సంజయ్ రాష్ట్రానికి ఏమి తీసుకొచ్చారని ప్రశ్నించారు. పునర్విభజన చట్టంలో పేర్కొన్న కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ,బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కేంద్రం నుంచి ఎందుకు తీసుకురాలేకపోతున్నారని నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వం వరంగల్లో మెగా టెక్స్టైల్ పార్క్ను ప్రారంభిస్తే... దానికి కేంద్రం నిధులే ఇవ్వలేదన్నారు. వరంగల్కు వేల ఏళ్ల చారిత్రక నేపథ్యం ఉంది కాబట్టే హెరిటేజ్ సిటీగా గుర్తింపు వచ్చిందని... ఇందులో కేంద్రం చేసిందేమీ లేదన్నారు. సంజయ్కి దమ్ముంటే రామప్ప ఆలయానికి హెరిటేజ్ గుర్తింపు తీసుకురావాలన్నారు.
పిచ్చి పిచ్చి కూతలు కూయొద్దు : వినయ్ భాస్కర్
తెలంగాణ ఉద్యమం కోసం కేసీఆర్ ప్రాణ త్యాగానికి కూడా సిద్దపడి.. టీఆర్ఎస్ నేతలంతా అనేక ఉద్యమాలు చేస్తున్నప్పుడు బీజేపీ నేతలు ఎక్కడున్నారని వినయ్ భాస్కర్ ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు సంక్షేమ,అభివృద్ది,సంస్కరణలతో ముందుకు వెళ్తున్న ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేయవద్దన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసమే జీవితాంతం పోరాడిన జయశంకర్ సార్ సమాధి స్థలాన్ని కూడా బీజేపీ నేతలు వివాదం చేస్తున్నారని మండిపడ్డారు. సంజయ్ పిచ్చి పిచ్చి కూతలు కూస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదన్నారు.
బండి సంజయ్ ఏమన్నారు...
మంగళవారం(జనవరి 5) వరంగల్లో పర్యటించిన రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. మందు తాగి వాహనం నడిపితే నేరమైనప్పుడు... మందు తాగి రాష్ట్రాన్ని నడిపితే నేరం కాదా అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ పాలనో రాష్ట్రం అధోగతి పాలైందని అన్నారు. రాష్ట్రంలో బీజేపీ ఎక్కడుందని ప్రశ్నించినవారికి దుబ్బాక,జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తమ సత్తా ఏంటో చూపించామన్నారు. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ 'కారు... సారు.. పదహారు..' నినాదం ఇచ్చిందని... కానీ ఇప్పుడు 'కారు... సారు... ఇక రారు..' అని ఎద్దేవా చేశారు. సంజయ్ చేసిన ఈ వ్యాఖ్యలతో టీఆర్ఎస్ నుంచి కౌంటర్ ఎటాక్ మొదలైంది.