'నగరంలో ఆంధ్ర ఆఫీసులకు విద్యుత్ నిలిపివేస్తాం'
హైదరాబాద్: తెలంగాణలో విద్యుత్ సమస్యలకు కారణమైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన పనితీరు మార్చుకోకపోతే హైదరాబాద్ లో ఉన్న వారి ప్రభుత్వ కార్యాలయాలకు విద్యుత్ నిలిపివేస్తామని టీఆర్ఎస్కు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హెచ్చరించారు.
మంగళవారం ట్యాంకుబండ్పై ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద వీరు ధర్నా చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విభజన చట్టంలో పేర్కొన్న కొన్ని అంశాలకు తెలంగాణ ప్రభుత్వం సహకరిస్తుంటే... అందుకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహారిస్తుందని పేర్కొన్నారు.
విద్యుత్ ఒప్పందాల రద్దుతో మొదలైన తెలంగాణ వ్యతిరేక విధానాలను తాజగా శ్రీశైలం ప్రాజెక్టుపై కృష్ణా ట్రిబ్యునల్కు చంద్రబాబుకు లేఖ రాయడం ద్వారా తెలంగాణపై ఉన్న వ్యతిరేకతను మరోసారి చూపించారని అన్నారు.
తెలంగాణలో విద్యుత్ కష్టాలు ఉన్నాయని తెలిసినా కూడా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అప్రతిష్ఠ పాలు చేసేందుకే ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఆటంకాలు సృష్టిస్తున్నారని.. దీనికి కేంద్రం కూడా సహాయం చేస్తుందని ఆరోపించారు.
ఇప్పటికైనా తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నైజాన్ని గుర్తించి విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం ఆయన ఇంటి ముందు ధర్నా చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఓదేలు, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీలు భాముప్రసాద్, సలీమ్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.