టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు స్థానిక సంస్థల ఎన్నికల భారం .. ఆర్డర్ వేసిన గులాబీ బాస్
తెలంగాణా రాష్ట్రంలో ఎన్నికల జాతర జరుగుతుంది . ఒకదానితర్వాత ఒకటి వరుసగా వస్తున్న ఎన్నికల నేపధ్యంలో అధికార టీఆర్ఎస్ పార్టీ నేతలకు ఊపిరి ఆడటం లేదు . అసెంబ్లీ ఎన్నికల అనంతరం , పంచాయితీ పోరు ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికలు వెనువెంటనే లోక్ సభ ఎన్నికలు ఇక ఇప్పుడు తాజాగా స్థానిక సంస్థల ఎన్నికలు రానే వచ్చాయి. మిగతా పార్టీల మాట ఎలా ఉన్నా అధికార పార్టీ నేతలకు మాత్రం ఎన్నికలు పెనుభారంగా మారాయి.
రెవెన్యూ ఉద్యోగుల ఉద్యమ బాట..! కొంపముంచనున్న సీఎం ప్రకటన..!!
ఎన్నికలు ఏవైనా పెనుభారం స్థానిక నాయకులపైనే వేస్తున్న గులాబీ బాస్
తెలంగాణలో ముందుగానే అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించుకుని మరొకసారి అధికారాన్ని దక్కించుకుంది కేసీఆర్ ప్రభుత్వం. అంతేకాకుండా తాజాగా లోక్ సభ ఎన్నికలను కూడా పూర్తి చేసుకుని ఫలితాల కోసం ఎదురుచూస్తుంది. అయితే మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటమి చవిచూసిన టీఆర్ఎస్ లోక్సభ ఎన్నికలలో కాస్త సీరియస్గానే కష్టపడింది. లోక్సభ ఎన్నికల భారాన్ని పూర్తిగా ఎమ్మెల్యేలకు, ఏ జిల్లాకు ఆ జిల్లా స్థానిక నాయకులకు , మంత్రులకు అప్పగించారు కేసీఆర్.
స్థానిక సంస్థల ఎన్నికల పూర్తి బాధ్యత ఎమ్మెల్యేలదే
ఇక స్థానిక సంస్థల ఎన్నికల నేపధ్యంలో మరొకసారి ఎమ్మెల్యేలకు అగ్నిపరిక్ష పెట్టబోతున్నారు కేసీఆర్. అదే ఇప్పుడు ఎమ్మెల్యేలకు పెద్ద తలనొప్పిగా మారింది . అయితే త్వరలోనే జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఎమ్మెల్యేలదే పూర్తి భాద్యత అని అభ్యర్థుల ఎంపిక కూడా ఎమ్మెల్యేలకే అప్పచెబుతున్నానంటూ ఆదేశాలు జారీ చేశారు. మండల, జిల్లా పరిషత్ ఎన్నికలతో పాటు మున్సిపల్ ఎన్నికలు కూడా త్వరలోనే జరగబోతున్నాయని ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయం సాధించేలా ఎమ్మెల్యేలు కృషి చేయాలని ఎమ్మెల్యేలకే కేసీఆర్ తేల్చి చెప్పారు.
తెలంగాణలో అన్ని జడ్పీ స్థానాలు క్లీన్ స్వీప్ చెయ్యటమే లక్ష్యం
తెలంగాణలో మొత్తం 32 జడ్పీ చైర్మన్ల స్థానాలను క్లీన్ స్వీప్ చేసి గెలుచుకోవడమే టీఆర్ఎస్ లక్ష్యమని నేతలకు మరోసారి పిలుపునిచ్చారు కేసీఆర్. ఈ విషయంలో ఏ మాత్రం అలసత్వం వహించినా సహించేది లేదని తేల్చి చెప్పారు. ఈ విషయంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలకు హెచ్చరికతో కూడిన సూచనలు జారీ చేసినట్టు తెలుస్తోంది.
భవిష్యత్ లో మంచి అవకాశాలు కావాలంటే ఎన్నికలకు గట్టిగా పనిచెయ్యాలంటున్న గులాబీ బాస్
ముందుముందు నేతలకు ఇచ్చే అవకాశాలకు ఈ అంశాలనే పరిగణలోకి తీసుకుంటామని కేసీఆర్ స్పష్టం చేసినట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పార్టీ కోసం పని చేస్తే మంచి గుర్తింపుతో పాటు భవిష్యత్తులో ఉన్నత అవకాశాలు లభిస్తాయని దానిని ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాలని పార్టీ గెలుపు కోసం పనిచేయాల్సిందిగా గులాబీ బాస్ చెప్పారు.