తెరాస ఎమ్మెల్యేల్లో గుబులు: మంత్రి పదవి లేకుంటే ఎమ్మెల్యేగా ఉంటాం కానీ, ఆ పదవి వద్దు!!
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను తెరాస 88 స్థానాల్లో విజయం సాధించింది. కేసీఆర్ త్వరలో కేబినెట్ను విస్తరించనున్నారు. మంత్రివర్గంలో చోటు దక్కుతుందని చాలామంది ఆశావహులు వరుసలో ఉన్నారు. ఇప్పటి వరకు కేసీఆర్తో పాటు మహమూద్ అలీ మాత్రమే ప్రమాణ స్వీకారం చేశారు.
గెలిచిన ఎమ్మెల్యేలు ప్రమాణం చేయడంతో పాటు కేబినెట్ను విస్తరించాల్సి ఉంది. పాత వారికి ఎందరికి అవకాశం వస్తుంది, కొత్తగా ఎవరు వస్తారు, మహిళలకు చోటు దక్కుతుంది, ఎవరికి ఏ పదవి దక్కుతుందనే చర్చ సాగుతోంది. దీంతో పాటు స్పీకర్ పదవి మరింత చర్చనీయాశంగా మారింది. ఈ పదవి ఎవరిని వరిస్తుందనే విషయంతో పాటు, దీని పట్ల ఎవరూ ఆసక్తిగా ఉండరని అంటున్నారు.
స్పీకర్ మాటెత్తడంలేదు
తొలుత ఎవరైనా కేబినెట్లో చోటు కోసం చూస్తారు. అది దక్కకుండా స్పీకర్ పదవి దక్కితే సంతోషిస్తారు. కానీ తెలంగాణలో మాత్రం పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉందని అంటున్నారు. స్పీకర్ పదవి అంటే ఆమడదూరం పోతున్నారట. తెరాస నుంచి గెలిచిన 88 మంది ఎమ్మెల్యేల్లో సీనియర్లు మంత్రి పదవి కోసం ప్రయత్నాలు చేస్తుండగా, సీనియర్లతో పాటు ఎవరూ స్పీకర్ మాటెత్తడం లేదట.
మంత్రి పదవి రాకుంటే ఎమ్మెల్యేగా ఉంటాం కానీ, స్పీకర్ వద్దు
చివరకు తమ ప్రయత్నాలతో మంత్రి పదవి రాకపోయినా ఫర్వాలేదు కానీ స్పీకర్ బాధ్యతలు మాత్రం వద్దని చెవులు కొరుక్కుంటున్నారట. మంత్రిగా ప్రయత్నాలు చేసి.. కేబినెట్లోకి తీసుకోకుంటే.. ఎమ్మెల్యేలుగా ఉంటాం కానీ, స్పీకర్గా మాత్రం ఉండేందుకు సాహసించడం లేదట. ఉమ్మడి ఏపీ నుంచి మొదలు చాలామంది స్పీకర్గా ఉన్న నేతలు ఓడిపోవడమే ఇందుకు కారణంగా చెబుతున్నారు. ఈ సెంటిమెంట్ కారణంగానే వారు దూరంగా ఉంటున్నారట.
వీరంతా ఓడిపోయారు
గతంలో ఉమ్మడి ఏపీలో స్పీకర్లుగా పని చేసిన శ్రీ పాద రావు, ప్రతిభా భారతి, సురేష్ రెడ్డి, నాదెండ్ల మనోహర్లు ఓడిపోయారు. కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం స్పీకర్గా పని చేసి, ఆ తర్వాత ఏకంగా ముఖ్యమంత్రి అయ్యారు. 2014 ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండటంతో ఆయన భవితవ్యం తేలలేదు. కానీ ఇప్పుడు ఆయన రాజకీయాల్లో క్రియాశీలకంగా లేరు.
స్పీకర్ ఎవరు?
ఇక, 2014 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన మధుసూదనా చారి తెలంగాణ రాష్ట్ర తొలి స్పీకర్గా పని చేశారు. కానీ ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆయన కూడా ఓడిపోయారు. దీంతో స్పీకర్ స్థానంలో కూర్చుంటే తదుపరి ఎన్నికల్లో ఓడిపోయి, రాజకీయ భవిష్యత్తు అగాధంలో పడుతుందనే ఆందోళన చాలామందిని వెంటాడుతోందట. అందుకే స్పీకర్ పదవి చేపట్టేందుకు ధైర్యం చేయడం లేదట. దీంతో ఇప్పుడు స్పీకర్ బాధ్యతలు ఎవరు స్వీకరిస్తారనే చర్చ సాగుతోంది.