కేసీఆర్తో కవిత కీలక భేటీ- సీబీఐ నోటీసులపై వాట్ నెక్స్ట్?
హైదరాబాద్: కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ.. టీఆర్ఎస్ నాయకురాలు, శాసనమండలి సభ్యురాలు కల్వకుంట్ల కవితకు నోటీసులు జారీ చేసిన ఘటన తెలంగాణలో రాజకీయ ప్రకంపనలకు తెర తీసింది. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ప్రమేయం ఉందంటూ ఆరోపణలను ఎదుర్కొంటోన్న నేపథ్యంలో- విచారణకు హాజరు కావాల్సి ఉంటుందంటూ సీబీఐ ఈ నోటీసుల్లో స్పష్టం చేసింది. ఈ నెల 6వ తేదీన ఆమెను విచారించనుంది సీబీఐ.
రాజకీయ దుమారం..
ఈ ఘటన రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. వచ్చే సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తెనే టార్గెట్గా చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దీని వెనుక భారతీయ జనత పార్టీ కుట్ర ఉందనే ఆరోపణలు ఊపందుకుంటోన్నాయి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సీబీఐ అధికారుల నోటీసులకు తాము ఏ మాత్రం భయపడబోమంటూ కవిత ఘాటుగా వ్యాఖ్యానించిన కొన్ని గంటల వ్యవధిలో ఈ నోటీసులు ఆమెకు జారీ అయ్యాయి.
రిమాండ్ రిపోర్ట్లో..
ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో నిందితుడిగా ఉన్న అమిత్ అరోరా అందించిన రిమాండ్ రిపోర్ట్లో కల్వకుంట్ల కవిత పేరును ప్రస్తావించారంటూ వార్తలొచ్చిన మరుసటి రోజే సీబీఐ నుంచి నోటీసులు రావడం కలకలం రేపుతోంది. మరోవంక- టీఆర్ఎస్ నాయకులు ఈ నోటీసులపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తోన్నారు. ఇవి విచారణ కోసం పంపించిన నోటీసులు కావని స్పష్టం చేస్తోన్నారు. ఆమె నుంచి వివరణ తీసుకోవాలనే ఉద్దేశంలో సీబీఐ అధికారులు ఉన్నారని చెబుతున్నారు.
వివరణ కోసమే..
సీఆర్పీసీ సెక్షన్ 160 కింద ఇచ్చే నోటీసులు సమన్ల పరిధిలో ఉండబోవని, వివరణ కోసమే నోటీసులు ఇచ్చారని తేల్చి చెబుతున్నారు టీఆర్ఎస్ నాయకులు. సీబీఐ అధికారులు స్వయంగా కవిత ఇంటికి వచ్చి వివరణ తీసుకొంటారని పేర్కొంటోన్నారు. ఇదే విషయాన్ని కవిత కూడా ప్రకటించారు. వివరణ కోసమే తనకు నోటీసు అందినట్టు చెప్పుకొచ్చారు. ఈ మేరకు తన అధికారిక ట్విట్టర్ అకౌంట్లో ఈ సమాచారాన్ని పోస్ట్ చేశారు.
విచారణలకు భయపడం..
నోటీసులకు తాను భయపడబోనని, ఎలాంటి విచారణకైనా సహకరిస్తానని కవిత చెప్పారు. వివరణ కోసం తనకు అందిన నోటీసులను బీజేపీ నాయకులు భూతద్దంలో చూపే ప్రయత్నం చేస్తోన్నారని మండిపడ్డారు. వాట్సాప్ యూనివర్సిటీ అసత్యాలను ప్రచారం చేస్తోందని ధ్వజమెత్తారు. వివరణ కోసమే సీబీఐ అధికారులు తనకు నోటీసులను ఇచ్చారనే విషయం బీజేపీకి తెలుసని, ప్రజలను తప్పుదారి పట్టించడానికే విచారణ అంటూ ప్రచారం చేస్తోందని అన్నారు.
కేసీఆర్తో భేటీ..
ఈ పరిణామాల మధ్య కవిత కొద్దిసేపటి కిందటే ప్రగతి భవన్లో తన తండ్రి, ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిశారు. నోటీసుల గురించి వివరించారు. దీనిపై ఎలా ముందుకు సాగాలనే విషయం మీద చర్చించారు. దీన్ని ఎలా ఎదుర్కొనాల్సి ఉంటుందనే విషయాన్ని అడిగి తెలుసుకున్నట్లు చెబుతున్నారు. న్యాయ నిపుణులతోనూ మాట్లాడే అవకాశాలు లేకపోలేదు. నోటీసులు అందిన విషయం తెలిసిన వెంటనే పెద్ద ఎత్తున టీఆర్ఎస్ కార్యకర్తలు, ఆమె అభిమానులు బంజారాహిల్స్లోని రోడ్ నంబర్ 12లోని కవిత నిసానికి చేరుకున్నారు. తాము ఉన్నామనే భరోసా ఇచ్చారు.