కాంగ్రెస్ నేతలతో కొండా మురళి భేటీ: 'వరంగల్'లో ఏం జరుగుతోంది!?..
వరంగల్ ఎల్లంబజార్ లోని ఓ ప్రముఖుడి ఇంటికి వెళ్లిన కొండా మురళి.. కాంగ్రెస్ నేతలను అక్కడికే పిలిపించుకుని మాట్లాడారట.
వరంగల్: సంగారెడ్డిలో నిర్వహించిన ప్రజాగర్జన సభతో పార్టీ బలోపేతానికి మరో ముందడుగేసిన కాంగ్రెస్.. అదే ఊపుతో తెలంగాణ అంతటా బలపడాలని యోచిస్తోంది. ఈ మేరకు భవిష్యత్తు కార్యాచరణ రూపొందించేలా కాంగ్రెస్ పెద్దలు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు సంగారెడ్డి సభలో రాహుల్ చేసిన ఆరోపణలను ఇటు టీఆర్ఎస్ సమర్థవంతంగానే తిప్పికొట్టింది. కుటుంబ పాలన గురించి కాంగ్రెస్ హైకమాండ్ మాట్లాడటం ఈ దశాబ్దపు అతిపెద్ద జోక్ అని కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. ఇలా రెండు పార్టీల మధ్య మాటల యుద్దం నడుస్తున్న తరుణంలో.. ఇరు వర్గాలకు చెందిన నేతలు ఒకచోట భేటీ అవడమంటే.. ఏం జరుగుతోంది? అన్న ఆసక్తి కలగడం సహజమే.
వరంగల్ పాలిటిక్స్ లో ఇప్పుడిదే హాట్ టాపిక్గా మారింది. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కొండా మురళి కాంగ్రెస్ కు చెందిన కొంతమంది నాయకులతో భేటీ అయినట్లు తెలుస్తోంది. వరంగల్ ఎల్లంబజార్ లోని ఓ ప్రముఖుడి ఇంటికి వెళ్లిన కొండా మురళి.. కాంగ్రెస్ నేతలను అక్కడికే పిలిపించుకుని మాట్లాడారట. సంగారెడ్డిలో కాంగ్రెస్ సభ తర్వాత కొండా మురళి ఆ పార్టీ నేతలతో భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది.
కాగా, కాంగ్రెస్కు చెందిన నేతలను కారెక్కించే పనిలో భాగంగానే కొండా మురళి టీఆర్ఎస్ నేతలతో భేటీ అయ్యారన్న ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. అయితే మురళి నుంచి మాత్రం ఇప్పటివరకు దీనిపై ఎలాంటి స్పష్టత లేదు. చూడాలి మరి కాంగ్రెస్ తో మురళి భేటీ వరంగల్ రాజకీయాలను ఎలా ప్రభావితం చేయనుందో!