ఓహో కాంగ్రెస్ ఎంపీలు అలాగా.. టీఆర్ఎస్ ఎంపీ బూర ఏమన్నారంటే..!
హైదరాబాద్ : కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కారెక్కించడంతో టీఆర్ఎస్పై హస్తం నేతలు గరమవుతూనే ఉన్నారు. సందు దొరికితే ఏకిపారేస్తున్నారు. అయినా కూడా టీఆర్ఎస్ను ఓ రేంజ్లో ఢీకొట్టలేకపోతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. అదలావుంటే టీఆర్ఎస్ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ కూడా తాజాగా అదే ధోరణిలో మాట్లాడటం ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన బూర పలు అంశాలను ప్రస్తావించారు.
కాంగ్రెస్ నేతలను ఉద్దేశిస్తూ బూర మాట్లాడిన తీరు చర్చానీయాంశమైంది. ప్రశ్నించాల్సిన గొంతుకలు ప్రశ్నార్థకంగా మారుతున్నాయని వ్యాఖ్యానించడం గమనార్హం. అసెంబ్లీకి, పార్లమెంటుకు తేడా తెలియకుండా కాంగ్రెస్ పార్టీ ఎంపీలు గొంతు చించుకుంటున్నారని ఆరోపించారు. గల్లీ స్థాయి అంశాలను సైతం ఢిల్లీలో ప్రస్తావిస్తూ లేనిపోని కన్ఫ్యూజన్లో పడుతున్నారని ఎద్దేవా చేశారు.
గల్లీ, యూత్ లీడర్లు సైతం.. మున్సిపల్ పోరుకు సన్నద్ధం.. ఈసారి రసవత్తర పోటీయేనా?
కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు బీజేపీని ప్రశ్నించే దమ్ము లేదన్న బూర.. పార్లమెంటులో రాష్ట్ర విభజన హామీలపై ఒక్క మాట మాట్లాడలేదని ధ్వజమెత్తారు. ఏది ఎక్కడ మాట్లాడాలో తెలియక దేశ రాజధానిలో సీఎం కేసీఆర్పై విమర్శలు చేయడం సరికాదని హితవు పలికారు. రాజకీయంగా పబ్బం గడుపుకోవడమే తప్ప కాంగ్రెస్ నేతలకు మరేమీ తెలియదని వ్యాఖ్యానించారు. అందుకే పార్లమెంటులో సంబంధం లేని విషయాలు మాట్లాడుతూ కాలాయాపన చేస్తున్నారని మండిపడ్డారు.