సొంత గూటికి జితేందర్ రెడ్డి..మహబూబ్ నగర్లో దశ తిరిగేనా..?
పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీలో మరో వికెట్ పడిపోయింది. మహబూబ్ నగర్ ఎంపీ జితేందర్ రెడ్డి బీజేపీ కండువా కప్పుకుంటారని గత కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు ఆయన సీనియర్ బీజేపీ నేతలతో కూడా టచ్లోకి వచ్చి చర్చలు జరిపారు. ఇందులో భాగంగానే జితేందర్ రెడ్డి తన సొంత గూటికి చేరుకున్నారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో జితేందర్ రెడ్డి బీజేపీ కండువా కప్పుకున్నారు.
గులాబీ పార్టీకి గుడ్బై..కమలం పార్టీలోకి జితేందర్ రెడ్డి
ఎన్నికల వేళ టీఆర్ఎస్ పార్టీకి వరస షాకులు తగులుతున్నాయి. కొద్ది రోజుల క్రితం టీఆర్ఎస్ను వీడారు మాజీ ఎంపీ వివేక్ ఈ ఘటన మరువక ముందే మహబూబ్ నగర్ సిటింగ్ ఎంపీ జితేందర్ రెడ్డి కారు దిగి కమలం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తనకు టీఆర్ఎస్ టికెట్ కేటాయించకపోవడంపై తీవ్ర మనస్తాపానికి గురైన జితేందర్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీ జాతాయాధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరారు.
రాజ్యసభ ఎంపీ ఇవ్వాలనే డిమాండ్..?
అంతకుముందు జితేందర్ రెడ్డి బీజేపీలో చేరేందుకు మూడు డిమాండ్లు కమలం పార్టీ అధినాయకత్వం ముందుంచినట్లు సమాచారం. ఇందులో ఒకటి తనకు రాజ్యసభ ఎంపీ ఇవ్వాలనేది ఒక డిమాండుగా ఉంది. అయితే రాజ్యసభకు పంపుతారా లేదా అనేదానిపై మాత్రం క్లారిటీ రాలేదు. ఇదే విషయమై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్తో చర్చలు జరిపారు.
పార్టీ ఆదేశాల మేరకే పోటీ..దేశాన్ని పీడిస్తున్న ప్రధాన సమస్యలు ఇవే: ప్రియాంకా గాంధీ
సీఎం కేసీఆర్కు రాజీనామా లేఖ..డీకే అరుణ విజయానికి కృషి
ఇక కొద్దిరోజుల క్రితం కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరారు మాజీ మంత్రి డీకే అరుణ. ఆమెను మహబూబ్ నగర్ లోక్సభ అభ్యర్థిగా ప్రకటించింది బీజేపీ అధిష్టానం. ఆమె గెలుపునకు సహకరించాలని జితేందర్ రెడ్డిని అధిష్టానం కోరినట్లు సమాచారం. జితేందర్ రెడ్డి స్థానికంగా బలమైన నేత కాబట్టి ఆయన్ను పార్టీలోకి తీసుకోవాలని బీజేపీ అధిష్టానం డిసైడ్ అయ్యింది. ఈ క్రమంలోనే ఆయన ఢిల్లీ వెళ్లడం.. అమిత్ షా సమక్షంలో పార్టీ కండువా కప్పుకోవడం అన్నీ చకాచకా జరిగిపోయాయి. ఇక బీజేపీలో చేరిన అనంతరం జితేందర్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ ఆ లేఖను సీఎం కేసీఆర్కు పంపారు. 2010లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు తాను టీఆర్ఎస్లో చేరినట్లు పేర్కొన్న జితేందర్ రెడ్డి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు.