జగన్కు కేసీఆర్ షాక్? మండలి రద్దుకు టీఆర్ఎస్ వ్యతిరేకం? ఏపీ ఎంపీ కేకే కీలక కామెంట్లు
ఆంధ్రప్రదేశ్తో పోల్చుకుంటే పూర్తిగా భిన్నమైన పరిస్థితులు.. స్థానిక సంస్థల నుంచి చట్టసభలదాకా అన్నింటా టీఆర్ఎస్దే ఆధిక్యం.. ఇతర పార్టీల నుంచి ఎన్నికైనవాళ్లు కూడా మరో ఆలోచనలేకుండా ఠక్కున కారెక్కుతుండటం.. మొత్తం 40 మంది ఉన్న శాసన మండలిలో టీఆర్ఎస్కు 26 మంది సభ్యుల బలముంది.. ఇన్ని అనుకూలతలు ఉన్న తర్వాత కూడా.. అసలు అవకాశమే లేకున్నా.. ఏపీలో జగన్ చేసినట్లే తెలంగాణలో కేసీఆర్ మండలిని రద్దు చేయబోతున్నారా? ఏపీ సర్కారు నిర్ణయంపై టీఆర్ఎస్ స్టాండ్ ఏంటి? తరహా ప్రశ్నలు పుట్టుకొచ్చాయి. వీటికి టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్, పార్లమెంటరీ పార్టీ నేత, ఏపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తోన్న కే.కేశవరావు చెప్పిన సమాధానాలు మరింత సంచలనం రేపుతున్నాయి.
టీఆర్ఎస్ స్టాండ్ ఏంటి?
శాసన మండలిని రద్దు చేస్తూ ఏపీ సర్కారు తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఏపీ కాకుండా మరో ఆరు రాష్ట్రాల్లోనే శాసన మండళ్లు ఉన్నాయి. మండళ్ల ఏర్పాటు లేదా రద్దు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమే అయినప్పటికీ దానికి పార్లమెంట్ ఆమోదం తప్పనిసరి. మాకూ మండళ్లు కావాలంటూ కొన్ని రాష్ట్రాలు చేసి పంపిన తీర్మానాలు కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ మండలి రద్దుపై ఢిల్లీలో ఏం జరగబోతోందనే టెన్షన్ నెలకొంది. ఏపీ మండలి రద్దు బిల్లు పార్లమెంట్ కు వస్తే.. టీఆర్ఎస్ అనుకూలంగా ఓటేస్తుందా? వ్యతిరేకిస్తుందా? అనేదీ ఆసక్తికరంగా మారింది.
జగన్ వాదన నాన్సెన్స్
పార్లమెంట్ లో టీఆర్ఎస్ ఏం చేయబోయేది ఆ పార్టీ పార్లమెంటరీ నేత కే.కేశవరావు చెప్పకనే చెప్పారు. ఏపీ శాసన మండలి రద్దును ఆయన తప్పుపట్టారు. మండలికి ఏడాదికి 60 కోట్ల రూపాయల ఖర్చు అవుతోందని, ఈ భారాన్ని తగ్గించుకోవడానికే దాన్ని రద్దు చేయాలని తీర్మానం చేసినట్లు అసెంబ్లీలో సీఎం జగన్ చెప్పడాన్ని కేకే ‘నాన్సెన్స్' అంటూ కొట్టిపారేశారు. ‘‘అంతపెద్ద ప్రభుత్వాన్నే నడుపుతుండగా లేనిది కేవలం రూ.60 కోట్ల వల్ల ఖజానాకు నష్టం అనడం తెలివితక్కువ వాదన''అని కుండబద్దలు కొట్టారు.
పెద్దల సభ ఉండాల్సిందే
జాతీయస్థాయిలోనైనా, రాష్ట్ర స్థాయిలోనైనా పెద్దల సభలు ఉండాల్సిందేనని కేకే స్పష్టం చేశారు. ఏపీలో కూడా మండలి కొనసాగాలనే తాను కోరుకుంటున్నట్లు తెలిపారు. గతంలో ఎన్టీఆర్ మండలిని రద్దు చేసినప్పుడు.. ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేశారనని కేకే గుర్తుచేశారు. కేసీఆర్, కేటీఆర్ తర్వాత టీఆర్ఎస్ లో నంబర్ 3గా కొనసాగుతోన్న కేకే వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. చంద్రబాబును అడ్డుకోవాల్సిన ప్రత్యేక పరిస్థితుల్లో జగన్ తీసుకున్న నిర్ణయాన్ని కేసీఆర్ సమర్థించారేతప్ప.. మండళ్ల రద్దుకు టీఆర్ఎస్ అనుకూలం కాదనే వాదన కూడా వినిపిస్తోంది.
కేకే ఏపీ ఎంపీనే..
జర్నలిస్టుగా మొదలై రాజకీయ నేతగా ఎదిగిన కేకే.. తన కెరీర్ లో చేపట్టిన పదవులన్నీ పెద్దల సభలోనే కావడం గమనార్హం. ఉమ్మడి రాష్ట్రంలో పట్టభద్రుల నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్సీగా ఎన్నికైన కేకే.. 1980-81 మధ్య శాసన మండలి డిప్యూటీ చైర్మన్ గానూ పనిచేశారు. రాజ్యసభ సభ్యుడిగా కాంగ్రెస్ హయాంలోనూ అనేక కమిటీలకు ప్రాతినిధ్యం వహించిన ఆయన.. ప్రస్తుతం టీఆర్ఎస్ తరఫున ఢిల్లీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత.. రాజ్యసభ సీట్ల పంపకాల్లో భాగంగా కేకే ఏపీకి.. కేవీపీ తెలంగాణకు బదిలీ అయ్యారు. తెలంగాణ మున్సిపల్ చైర్మన్ల ఎన్నికల్లో కేవీపీ ఎక్స్ అఫీషియో హోదాలో ఓటేయడం తెలిసిందే.