వాళ్లు బయటకొచ్చి: అవిశ్వాసంపై టీడీపీకి కవిత దిమ్మతిరిగే షాక్
న్యూఢిల్లీ: అవిశ్వాస తీర్మానంపై తెలుగుదేశం పార్టీ పలు పార్టీల మద్దతు కూడగడుతోంది. ఇందులో భాగంగా తెరాసను కూడా కలిసింది. కానీ తెరాస హామీ ఇవ్వలేకపోతోంది. అంతేకాదు, టీడీపీకి ఎంపీ కవిత దిమ్మతిరిగే సమాధానం ఇచ్చారు. ఇన్నాళ్లు కలిసి ఉన్నది వాళ్లేనని విమర్శించారు.
టీడీపీ ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానంపై తమ నిర్ణయం తర్వాత ఉంటుందని నిజామాబాద్ టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత మంగళవారం వ్యాఖ్యానించారు. వారు పెట్టిన అవిశ్వాస తీర్మానం ఆమోదం పొందాక తమ వైఖరి ఉంటుందని చెప్పారు. ఆమోదం రాకముందే ఏం చెప్పలేమని వెల్లడించారు.
బీజేపీతో తెలుగుదేశం పార్టీ ఇన్నాళ్లు కలిసి పని చేసిందని ఆమె గుర్తు చేశారు. ఇప్పుడు వారు ఎన్డీయే నుంచి బయటకు వచ్చారు కాబట్టి గట్టిగా మాట్లాడుతున్నారని విమర్శించారు.
సమస్యలు, హామీలపై అంశాలవారీగా కేంద్రంపై ఒత్తిడి పెంచుతామని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీతో, బీజేపీతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకోవాల్సిన అవసరం తమకు లేదని వ్యాఖ్యానించారు. హైకోర్టు విభజనపై పార్లమెంటులో కేంద్రాన్ని తప్పకుండా నిలదీస్తామన్నారు. నాన్ సీరియస్ పొలిటీషియన్స్ మాట్లాడితే తనకు మాట్లాడ బుద్ది కాదన్నారు.
లాలూ ప్రసాద్ యాదవ్ మద్దతు
కేంద్రంపై టీడీపీ ప్రవేశపెట్టే అవిశ్వాసానికి తమ మద్దతు ఉంటుందని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ప్రకటించారు. టీడీపీ ఎంపీలు గల్లా జయదేవ్, రవీంద్ర బాబు, గరికపాటి రామ్మోహన్ రావులు లాలూను కలిశారు. తమ మద్దతు ఉంటుందని ఆన హామీ ఇచ్చారు.