కరోనా ఎఫెక్ట్ : చెప్పడం కాదు.. చేసి చూపించిన టీఆర్ఎస్ ఎంపీ..
కరోనా వైరస్ ఎఫెక్ట్ ప్రతీచోటా కనిపిస్తోంది. ఎవరైనా షేక్ హ్యాండ్ ఇచ్చినా.. అవతలి వ్యక్తి చేయి చాచే పరిస్థితి లేదు. తుమ్మినా దగ్గినా పక్కనున్నవాళ్లు అప్రమత్తమవుతున్నారు. బస్సులు,రైళ్లు,సూపర్ మార్కెట్లలో చాలామంది ముఖాలకు కర్చీఫ్ కట్టుకుంటున్నారు. అవసరమైతే తప్ప బయటకు వెళ్లడానికి జంకుతున్నారు. అటు పెళ్లిళ్లు,ఫంక్షన్ల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. తక్కువ సంఖ్యలో జనం వస్తున్నారు. ప్రజలకు ఆదర్శంగా నిలవాల్సిన ప్రజాప్రతినిధులు కూడా కరోనా నియంత్రణ చర్యలను తూచా తప్పకుండా పాటిస్తున్నారు.
తాజాగా టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ఓ కొత్త జంటను వాట్సాప్ వీడియో కాల్ ద్వారా ఆశీర్వదించారు. నిజానికి ఈ పెళ్లికి తాను కుటుంబంతో సహా స్వయంగా వెళ్లాలనుకున్నారు. కానీ కరోనా నియంత్రణ చర్యలపై సీఎం ఆదేశాలతో ఇంటి నుంచే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దంపతులను ఆశీర్వదించారు. ఒక బాధ్యాతయుతమైన పదవిలో ఉన్న ప్రజా ప్రతినిధిగా ఇలాంటి తరుణంలో తాను వివాహ వేడుకకు హాజరవడం ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపిస్తుందని ఆయన భావించారు. అందుకే వివాహ వేడుకకు దూరంగా ఉండి వీడియో కాల్ ద్వారా ఆశీర్వదించారు.ఈ వివాహం భువనగిరిలోని వైఎస్ఆర్ గార్డెన్లో జరిగింది. పెళ్లి కొడుకు సంతోష్ కుమార్ వద్ద సెక్యూరిటీగా పనిచేస్తున్న నరేందర్ గౌడ్ అని సమాచారం.
Recommended Video
అటు చాలామంది ప్రముఖులు తమ కార్యక్రమాలను వాయిదా వేసుకుంటున్న సంగతి తెలిసిందే. కరోనా అనుమానిత లక్షణాలతో బీజేపీ ఎంపీ వసుంధర రాజే,ఆమె కుటుంబం స్వీయ నిర్బంధం(క్వారెంటైన్)లో ఉన్నారు. ఇలా అనుమానం ఉన్న చాలామంది ప్రముఖులు స్వీయ నిర్బంధంలోకి వెళ్తున్నారు. మరోవైపు కరోనా కేసుల సంఖ్య దేశంలో రోజురోజుకు పెరుగుతోంది. శుక్రవారం(మార్చి 20) నాటికి దేశంలో కరోనా కేసుల సంఖ్య 223కు పెరిగింది. కేంద్రం ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని వెల్లడించింది.మహారాష్ట్రలో ఇప్పటి వరకు అత్యధికంగా 52 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్లో మరో పాజిటివ్ కేసు నమోదు కావడంతో తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 17కు చేరుకుంది. కేరళలో 28, ఉత్తరప్రదేశ్లో 23, వెస్ట్ బెంగాల్లో 2, లడఖ్లో 10, ఢిల్లీలో 17, ఆంధ్రప్రదేశ్లో 3 కేసులు నమోదయ్యాయి.