మోడీ ప్రభుత్వం తొందరపాటు, పట్టించుకోరా: వినోద్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో ఎనిమిది మంది సభ్యుల పెంపు కోసం విభజన చట్టానికి సవరణ చేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించటం తొందరపాటు నిర్ణయమనీ, అనాలోచిత చర్య అని తెలంగాణ రాష్ట్ర సమితి పార్లమెంటు సభ్యుడు వినోద్ కుమార్ బుధవారం అన్నారు. ఏపీ, తెలంగాణ ఉమ్మడి భవన్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు.
కేంద్ర కేబినెట్ విభజన చట్టానికి సవరణలు చేయాలనుకుంటే తొలుత కేసీఆర్, చంద్రబాబు, ఇరు రాష్ట్రాల అధికారులతో మాట్లాడాల్సిందని, తెలంగాణ - ఆంధ్రప్రదేశ్లు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవాల్సిందని, ఆ తర్వాతే నిర్ణయం తీసుకోవాల్సిందన్నారు. ఇలా చేయనందున కేంద్ర కేబినెట్ నిర్ణయంపై తమ నిరసన వ్యక్తం చేస్తున్నామన్నారు.
విభజన చట్టానికి సవరణలు తీసుకురావాలని కేంద్రం ఆలోచిస్తోందంటూ పది రోజుల కిందట కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ప్రకటించినప్పుడు ఆ ప్రకటనను తాను, తమ పార్టీ నేత కే కేశవరావు స్వాగతించామన్నారు. అయితే, సమగ్రంగా సమస్యల పరిష్కారానికి సవరణలు చేయకుండా చంద్రబాబుకు మరో ఎనిమిది మందికి ఎమ్మెల్సీ పదవులు కట్టబెట్టేందుకు మాత్రమే ఆస్కారం కల్పిస్తూ ఒక్క సవరణను మాత్రమే చేయాలని చూడటం సరికాదన్నారు.
రాజ్యసభ సభ్యుల్ని తెలంగాణ వారిని ఆంధ్రాకు, ఆంధ్రా వారిని తెలంగాణకు పంపిణీ చేశారని, ఈ సమస్యను పరిష్కరించేందుకు దీనికి సవరణలు చేయాల్సి ఉందన్నారు. ఆయా రాష్ట్రాల్లోని లోకసభ నియోజకవర్గాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల గురించి పేర్కొన్నారన్నారు.
అయితే, ఖమ్మం లోకసభ పరిధిలోని ఏడు మండలాలను ఏపీకి ఇవ్వటంతో పినపాక అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక మండలం, అశ్వారావుపేట నియోజకవర్గంలో ఒక మండలం, పలు గ్రామాలు, భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గంలో పలు మండలాలు పోయాయని, ఈ సమస్యను అధిగమించేందుకు షెడ్యూల్-2కు సవరణ చేయాల్సి ఉందన్నారు.
ప్రస్తుతం భద్రాచలం పట్టణానికి వెళ్లాలంటే ఏపీలోని 4-5 గ్రామాలు దాటాల్సి ఉన్నదని, వాస్తవానికి ఇవి పోలవరం ప్రాజెక్టు కారణంగా ముంపునకు గురికాబోవని, ఈ నేపథ్యంలో వీటిని తెలంగాణకు ఇచ్చేయాలన్నారు. ఈ మేరకు కూడా చట్ట సవరణ చేయాల్సి ఉందన్నారు. ఇన్ని ముఖ్యమైన సమస్యలు ఉంటే వాటిని పట్టించుకోకుండా, పరిష్కరించకుండా కేంద్రం ఎనిమిది మంది ఎమ్మెల్సీల కోసం సవరణ చేయటం సరికాదన్నారు.
కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రతిపాదనల్ని పట్టించుకోకుండా చట్ట సవరణ చేయటం తమను చాలా బాధకు గురి చేసిందని చెప్పారు. వెంకయ్య తనతోను, కేకేతోను మాట్లాడిన విషయాలు మీడియాకు తెలిపేవి కాదన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి రామచంద్రు తేజావత్ మాట్లాడుతూ... ఏదైనా చట్ట సవరణ చేయాలంటే చట్టం వచ్చిన తర్వాత రెండేళ్లు దాని కష్టనష్టాలను తెలుసుకుని, విశ్లేషించి నిర్ణయం తీసుకుంటుంటారని, అయితే విభజన చట్టాన్ని మాత్రం అమల్లోకి రాకముందే సవరించారని, 200 రోజుల్లో మరోమారు సవరించారని తెలిపారు. కేంద్రం ఒంటెత్తు పోకడలకు ఇది నిదర్శనమన్నారు.