డైలమా: 'వారు ఏపీ ఎమ్మెల్యేలా లేక తెలంగాణ ఎమ్మెల్యేలా,తేల్చండి'
ఢిల్లీ: తెలంగాణ రాష్ట్రం నుంచి ఏపీలో కలిపిన ఏడు మండలాలకు చెందిన ఎమ్మెల్యేలు ఏ రాష్ట్ర శాసన సభకు ప్రాతినిథ్యం వహించాలో తెలియడం లేదని తెలంగాణ రాష్ట్ర సమితి పార్లమెంటు సభ్యుడు వినోద్ కుమార్ గురువారం నాడు అన్నారు.
ఆయన లోకసభలో మాట్లాడారు. ఏడు మండలాలకు చెందిన ఎమ్మెల్యేల విషయంలో కేంద్రం స్పష్టత ఇవ్వాలని డిమాండు చేశారు. భద్రాచలం నియోజకవర్గంలోని తొంబై శాతం ప్రజలు ఏపీలోకి వెళ్లారని, కానీ ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే ఇరురాష్ట్రాల శాసనసభ సమావేశాలకు హాజరుకాలేక సతమతమవుతున్నారన్నారు.
విభజన చట్టంలోని సెక్షన్ 26 ప్రకారం తెలంగాణ, ఏపీల్లో శాసనసభ స్థానాల సంఖ్య పెంచాలన్నారు. ఏడు మండలాల్లోని ప్రజలు కూడా ఏ రాష్ట్రానికి చెందుతారో అర్థం కాని అయోమయ పరిస్థితి ఉందన్నారు. ఎమ్మెల్యేలు ప్రస్తుతం ఇటు తెలంగాణ శాసనసభకుగానీ, అటు ఆంధ్రప్రదేశ్ శాసనసభకుగానీ హాజరయ్యే పరిస్థితి లేదన్నారు.
భారత్-బంగ్లాదేశ్ మధ్య ఇటీవల కుదిరిన ఒప్పందం ప్రకారం ఇంతకాలం ఆ దేశ పరిధిలో ఉన్న కొన్ని కాలనీలు మన దేశంలో కలిసిన తర్వాత పశ్చిమ బెంగాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పాల్గొనడానికి వీలు కల్పించే బిల్లుపై చర్చ సందర్భంగా లోకసభలో వినోద్ కుమార్ ఈ అంశాన్ని ప్రస్తావించారు.
పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతం పేరుతో తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు చెందిన ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్లో విలీనం చేశారని, భద్రాచలం శాసనసభ నియోజకవర్గ పరిధిలో ఉన్న ఓటర్లలో సుమారు తొంబై శాతం మంది ఈ కారణంగా ఏపీలోకి వెళ్ళాల్సి వచ్చిందన్నారు.
ఎమ్మెల్యేల పరిస్థితి మాత్రం అయోమయంగా ఉందన్నారు. తెలంగాణ శాసనసభకు ఓటు వేసిన ప్రజలు ఈ రాష్ట్ర పరిధిలో లేనందువల్ల వారి అంశాలపై స్పందించాల్సిన అవసరం కూడా లేదన్నారు. ఈ ఏడు గ్రామాల ప్రజలు ఇప్పుడు తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్కూ చెందకుండా పోయారని, ప్రజాస్వామ్యంలో ఇదొక విచిత్రమైన పరిస్థితి అన్నారు.
రైల్వే బడ్జెట్పై తెరాస ఎంపీల హర్షం
రైల్వే బడ్జెట్లో తెలంగాణలోని పలు ప్రాజెక్టులకు నిధులను కేటాయించడం, కొత్త లైన్లకు అనుమతి మంజూరు చేయడం, కొన్ని కొత్త లైన్ల సర్వేకు ఆమోదం తెలుపడంపై తెరాస ఎంపీలు హర్షం వ్యక్తం చేశారు. అయితే ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న కాజీపేట వ్యాగన్ ఫ్యాక్టరీ, కోచ్ ఫ్యాక్టరీ తదితరాల ప్రస్తావన లేకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం
శారు. వీటిపై కూడా ఒత్తిడి తీసుకొస్తామనిన్నారు. కాజీపేటను రైల్వే డివిజన్ కేంద్రంగా మార్చేందుకు ప్రయత్నిస్తామని ఎంపీలు కల్వకుంట్ల కవిత, జితేందర్ రెడ్డి పేర్కొన్నారు. రైల్వే బడ్జెట్లో రానున్న పదేళ్ల కాలానికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక కనిపించిందని కవిత అన్నారు.
గతంలో రైల్వే మంత్రులు వారి స్వంత రాష్ర్టాలకు ఎక్కువ ప్రాజెక్టులను ఇచ్చేవారని ఆ విధంగా తెలంగాణకు గతంలో పెద్దగా రైల్వే ప్రాజెక్టులు రాలేదన్నారు. అయితే తాజా బడ్జెట్లో మాత్రం ఎక్కువగా ప్రయాణికులకు సౌకర్యాలను పెంపొందించడంపై మంత్రి దృష్టి పెట్టారన్నారు.
ప్రజల పన్నులపై ఆధారపడే విధానానికి బదులుగా ఎల్ఐసీ లాంటి సంస్థల ద్వారా ఒకటిన్నర లక్షల కోట్ల రూపాయల మేరకు పెట్టుబడులను పొంది రైల్వే శాఖలో కొత్త ప్రాజెక్టులకు వినియోగించాలని మంత్రి ఆలోచించడం ఆహ్వానించదగ్గ విషయమన్నారు.
రైల్వే స్టేషన్లలో పోర్టర్లుగా ఉన్నవారిని సహాయక్ అనే పేరుతో పిలువనున్నట్లు పేర్కొనడమే కాకుండా వారికి గ్రూప్ ఇన్సూరెన్స్ పథకాన్ని కూడా వర్తింపజేయాలనుకోవడం మంచి పరిణామమన్నారు. ఇప్పుడు జరిగిన కేటాయింపులే కాకుండా ఇదే బడ్జెట్ కాలంలో మరికొన్ని ప్రాజెక్టులకు కూడా ప్రయత్నాలు చేస్తామన్నారు.