ఇతర దేశాల్లోనైతే మంత్రిని ఉరి తీస్తారు: కాంగ్రెస్పై వినోద్ ఫైర్
హైదరాబాద్: ప్రాణహిత-చేవెళ్లకు ప్రాజెక్టుకు అనుమతులు రాకుండానే గత ప్రభుత్వంలో కోట్ల రూపాయలు ఖర్చు చేశారని, వేరే దేశాల్లో అయితే భారీ నీటిపారుదల శాఖ మంత్రిని ఉరి తీసేవారని తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) పార్లమెంటు సభ్యుడదు వినోద్ కుమార్ అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారంటూ కాంగ్రెస్ నేతల తీరుపై ఆయన సోమవారం తెలంగాణభవన్లో మీడియా సమావేశంలో దుయ్యబట్టారు.
రాష్ట్ర పునర్విభజన చట్టంలోని అంశాలను పరిష్కరించాల్సిందిగా కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ను కలవడాన్ని కూడా ప్రతిపక్ష నేతలు రాద్దాంతం చేస్తున్నారని ఆయన అన్నారు. రైతు ఆత్మహత్యల నివారణకు పరిష్కారం చూపాలనే ఆలోచన ప్రతిపక్షాలకు లేదని, బీజేపీ పాలిత రాష్ర్టాల్లోనూ రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయని ఆయన అన్నారు.
కాళోజీ మెడికల్ యూనివర్సిటీ గురించి తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డికి ఏం తెలుసని మాట్లాడుతున్నారని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలు విమర్శలు చేయటం ఆపి అభివృద్ధికి తమ వంతు తోడ్పాటుగా ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాలని సూచించారు.
ప్రాణహిత ప్రాజెక్టు ఎందుకు కట్టలేదో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ నుంచి డబ్బులు రాకపోవటం వల్లే కాళోజీ హెల్త్ వర్సిటీ ఆలస్యం అవుతోందని చెప్పారు.