భారీ మెజార్టీతో గెలిచారు కానీ: టీఆర్ఎస్ ఎంపీలతో ప్రధాని మోడీ సరదాగా ఏమన్నారంటే
హైదరాబాద్/న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) పార్లమెంటు సభ్యులు సోమవారం నాడు ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. ప్రధానిని కలిసిన వారిలో వినోద్, జితెందర్ రెడ్డి, బూర నర్సయ్య గౌడ్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా ప్రధాని వారితో సరదాగా మాట్లాడారు.
ఇటీవల తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తెరాస అద్భుత విజయం సాధించిన విషయం తెలిసిందే. 119 అసెంబ్లీ స్థానాలకు గాను 88 స్థానాల్లో గెలిచింది. మరో ఇద్దరు స్వతంత్రులు తెరాసలో చేరుతున్నారు. 47 శాతం ఓట్లు తెరాసకు పోలయ్యాయి. తెరాస ఘన విజయం సాధించి, కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు. దీనిని గుర్తు చేస్తూ తెరాస ఎంపీలతో ప్రధాని సరదాగా మాట్లాడారు.
ఉత్తరాయణ ఏకాదశినాడు తొలి అసెంబ్లీ: 18న కేబినెట్, రేవంత్ను ఓడించిన నరేందర్ సహా వీరికి ఛాన్స్?
భారీ మెజార్టీతో గెలిచి ఒక్క స్వీట్ ఇవ్వలేదు
తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో గెలిచిందని, కానీ తనకు ఒక్క మిఠాయి కూడా తినిపించలేదని తెరాస లోకసభా పక్ష నేత జితెందర్ రెడ్డి, ఆ పార్టీ ఎంపీలతో ప్రధానమంత్రి అన్నారు. ఢిల్లీలో తమ పార్టీకి కార్యాలయాన్ని కేటాయించాలని కోరేందుకు వారు ఆయన వద్దకు వెళ్లారు. ఈ సందర్భంగా ఈ సంభాషణ జరిగింది.
పుల్లారెడ్డి స్వీట్స్ తినిపిస్తామని తెరాస ఎంపీలు
మంత్రులు, పార్లమెంటు సభ్యులకు మిఠాయిలు తినిపించారని, నాకు మాత్రం ఇవ్వరా అని నరేంద్ర మోడీ వారితో అన్నారు. దానికి తెరాస ఎంపీలు స్పందిస్తూ... పుల్లారెడ్డి స్వీట్స్ నుంచి ప్రత్యేకంగా తెప్పించి ఇస్తామని చెప్పారు. బెల్లం, కాజాతో చేసే మిఠాయి ఇస్తామన్నారు.
ఢిల్లీలో పార్టీ కార్యాలయం కోసం స్థలం
తెరాస ఎంపీలు ప్రధానితో ఇంకా మాట్లాడుతూ... తెలంగాణ నుంచి 17 మంది లోకసభ సభ్యులు ఉన్నారని, చట్ట ప్రకారం తమ పార్టీ కార్యాలయానికి వెయ్యి చదరపు గజాల స్థలం ఇవ్వాలని వారు కోరారు. రాజేంద్రప్రసాద్ రోడ్డులోని ఖాళీ స్థలాన్ని తమ పార్టీ కార్యాలయ నిర్మాణానికి కేటాయించాలని కోరారు.