మా డిమాండ్లపై వాగ్ధానం ఇస్తేనే..: అవిశ్వాసంపై తేల్చేసిన టీఆర్ఎస్
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా పోరాటానికి మద్దతు పలికిన తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్.. ఏపీ పార్టీలు కేంద్రంపై పెట్టిన అవిశ్వాసంపై మాత్రం భిన్నంగా వ్యవహరిస్తోంది. రిజర్వేషన్ల అంశాన్ని రాష్ట్రాలకే వదిలేయాలని గత కొద్ది రోజులుగా టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంటులో ఆందోళనలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
ఆగని టీఆర్ఎస్ ఆందోళనలు
అయితే, ఏపీ హోదా పోరాటానికి మద్దతు పలికినప్పటికీ.. అవిశ్వాసం తీర్మానం నోటీసులను స్పీకర్ చదివిన సందర్భంలోనూ టీఆర్ఎస్ ఎంపీలు తమ ఆందోళనలను విరమించుకోకపోవడం గమనార్హం. టీఆర్ఎస్ తోపాటు ఇతర పార్టీల ఎంపీల ఆందోళనలతో అవిశ్వాసంపై చర్చ జరగకుండా సభ వాయిదా పడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
Recommended Video
అవిశ్వాసంపై తటస్థమే
కాగా, కేంద్రంపై ఏపీ పార్టీలు పెట్టిన అవిశ్వాస తీర్మానం విషయంలో టీఆర్ఎస్ తటస్థంగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నట్లు ఆ పార్టీ ఎంపీలు స్పష్టం చేశారు. రిజర్వేషన్ల అంశాన్ని రాష్ట్రానికే వదిలిపెట్టాలన్న డిమాండ్తో మంగళవారం కూడా లోకసభలో టీఆర్ఎస్ ఎంపీలు తమ ఆందోళనలను కొనసాగించారు.
ఎవరినీ అనుసంచం
అవిశ్వాస తీర్మానం జరుగుతుండగా ఆందోళన చేయడం కంటే చర్చకు మద్దతుగా నిలవవచ్చు కాదా అని మీడియా అడిగిన ప్రశ్నకు ఎంపీ జితేందర్ రెడ్డి స్పందిస్తూ..
‘రెండు వారాలుగా మా డిమాండ్ల కోసం ఆందోళన చేస్తున్నాం. డిమాండ్లను హౌస్లో పెట్టి పరిష్కరించుకుంటాం. ఎవ్వరినీ అనుసరించాల్సిన అవసరం మాకు లేదు. సరైన హామీ లభించే వరకు ఆందోళన కొనసాగుతుంది' అని సమాధానమిచ్చారు.
మా వాగ్ధానం ఇస్తారా?
టీఆర్ఎస్ పరోక్షంగా బీజేపీకి సహకరిస్తోందని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి కదా? అని మీడియా అడిగిన ప్రశ్నకు జితేందర్ రెడ్డి సమాధానమిస్తూ.. ‘వాళ్లకు వాళ్లు ఆరోపణలు చేసుకోవడం కాదు. ఈ రోజు వాళ్లకు అవిశ్వాస తీర్మానం పెట్టాలని మనసొచ్చింది. మా ప్రజల ఆకంక్షలు, డిమాండ్లు మాకు ముఖ్యం. మా డిమాండ్లపై వాళ్లు వాగ్ధానం చేసి మమ్మల్ని కూర్చోబెడితే కూర్చోవడానికి సిద్ధం' అని చెప్పుకొచ్చారు. ఏపీ టీడీపీ, వైసీపీ ఎంపీలు అవిశ్వాస తీర్మానం పెట్టిన విషయం తెలిసిందే.