కేసీఆర్ ముందు మీరెంత: జైట్లీ బడ్జెట్పై టిఆర్ఎస్ ఎంపిల అసంతృప్తి
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గురువారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్పై తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) పార్లమెంటు సభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్ర బడ్జెట్పై మరింత స్పష్టత రావాల్సి ఉందని అన్నారు.
Recommended Video
ఏ రాష్ట్రానికి, ఏ ప్రాంతానికి ఎన్ని నిధులు కేటాయించారనే విషయంపై బడ్జెట్లో స్పష్టత లేదని అన్నారు. ఎన్నికల సమయం కావడంతో ఆకర్షణీయమైన బడ్జెట్ను ప్రతిపాదించారని అభిప్రాయపడ్డారు.
కొన్ని అంశాలను విస్మరించారు
కొన్ని విషయాలను బడ్జెట్లో కొన్ని విషయాలను విస్మరించారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆవసరాలను కేంద్రం దృష్టికి తీసుకుని వెళ్తామని, రాష్ట్రానికి కేంద్రం తగిన నిధులు కేటాయిస్తుందని ఆశిస్తున్నామని వారన్నారు బడ్డెట్ ప్రతిపాదన తర్వాత టిఆర్ఎస్ ఎంపీలు జితేందర్ రెడ్డి, విశ్వేశ్వరరెడ్డి మీడియాతో మాట్లాడారు.
నిరుటి నుంచి ఈ పద్ధతి
రాష్ట్రాలవారీగా కాకుండా మంత్రిత్వ శాఖల వారగా బడ్జెట్ కేటాయింపులు జరిపారని వారు అభిప్రాయపడ్డారు. గత సంవత్సరం ప్రభుత్వం ఈ కొత్త విధానాన్ని అనుసరిస్తోందని అన్నారు. ఇంటింటికి మంచినీరు, రైతుల ఆదాయం రెట్టింపు, రైల్వే,, మౌలిక వసతులకు బడ్జెట్లో పెద్ద పీట వేశారని చెప్పారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులను కేంద్రం నుంచి రాబడుతామని చెప్పారు.
కేసీఆర్ లాగా చేయలేరు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాదిరిగా బడ్జెట్ను కేంద్రం గానీ, ఇతర దేశాలు గానీ రూపొందించలేవని జితేందర్ రెడ్డి అన్నారు. అన్ని వర్గాల ప్రజల కష్టాలను, అవసరాలను ప్రజల నాడి పట్టుకుని కేసీఆర్ బడ్జెట్ను రూపొందిస్తున్నారని జితేందర్ రెడ్డి అన్నారు. మిషన్ భగీరథ, పింఛన్లు, డబుల్ బెడ్రూం ఇల్లు, ప్రతి వ్యక్తికీ ఆరు కిలోల బియ్యం, షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి ఇలా ఎన్నో పథకాలను కేసీఆర్ రూపొందించినట్లు ఆయన తెలిపారు.
ఆకర్షణియంగానే ఉంది గానీ...
ఎన్నికల సంవత్సవరం కావడంతో ఆకర్షణీయమైన బడ్జెట్ను ప్రతిపాదించారని కొండా విశ్వేశ్వర రెడ్డి జైట్లీ బడ్జెట్పై అభిప్రాయపడ్డారు. గ్రామీణాభివృద్ధికి, రైతాంగానికి పెద్ద పీట వేశారని అన్నారు. అయితే కొన్ని అంశాలను విస్మరించారని అన్నారు. పశు సంవర్థక శాఖకు కేవలం రూ.11 వేల కోట్లు, హార్టికల్చర్కు రూ.2 వేల కోట్లు మాత్రమే కేటాయించారని అన్నారు.
కేంద్ర బడ్జెట్ కన్నా తెలంగాణ బడ్జెట్ ముందుంది
కేంద్ర బడ్జెట్తో పోలిస్తే తెలంగాణ బడ్జెటే ముందుందని కొండా విశ్వేశ్వర రెడ్డి అన్నారు. కేవలం గొర్రెల పెంపకానికే రాష్ట్ర ప్రభుత్వం రూ.4వేల కోట్లు కేటాయించిందని చెప్పారు. బడ్జెట్ లెక్కలు చెప్పారు గానీ ఏ రాష్ట్రంలో ఏది నెలకొల్పబోతున్నారు, ఏం కేటాయించబోతున్నారో చెప్పలేదని అన్నారు.
తెలంగాణ నుంచి వచ్చే పన్నులే ఎక్కువ
తెలంగాణపై పెట్టుబడి పెడితే తిరిగి రాష్ట్రం దేశానికి కాంట్రిబ్యూషన్ ఇస్తుందని విశ్వేశ్వర రెడ్డి అన్నారు. దేశవ్యాప్తంగా తెలంగాణ నుంచి వచ్చే పన్నులు ఎక్కువ అని ఆయన అన్నారు. నిరుద్యోగుల శిక్షణకు నిధులు కేటాయించడం ఆహ్వానించదగిందని అన్నారు. గిరిజన ప్రాంతాల్లో ఏకలవ్య పాఠశాలలు నెలకొల్పే ఆలోచనను స్వాగతిస్తున్నట్లు కొండా విశ్వేశ్వర రెడ్డి చెప్పారు. గిరిజనులను అధికంగా ఉన్న తాండూరు, పరిగిల్లో కొత్తగా ఏకలవ్య పాఠశాలలు వస్తాయని ఆశిస్తున్నట్లు తెలిపారు.
మిషన్ భగీరథకు కేటాయిస్తారని...
సొంతిళ్ల నిర్మాణం కోసం కేంద్రం నిధులు కేటాయించిందని విశ్వేశ్వర రెడ్డి చెప్పారు. ఐ విషయంలో డబుల్ బెడ్రూం పథకంతో తెలంగాణ ముందు వరుసలో ఉందని అన్నారు. మిషన్ భగీరథ, కాకతీయ, నీటిపారుదల ప్రాజెక్టులకు నిధులు కోరామని, కేంద్రం కూడా ఇంటింటికీ నీటి మంచినీటి పథకం కోసం నిధులు కేటాయించిందని, ఈ పథకంలో భాగంగా ఇంటింటికీ నీరందించే మిషన్ భగీరథకు నిధులు కేటాయిస్తుందని ఆశిస్తున్నామని ఆయన అన్నారు.