కోట్లు ఎగ్గొట్టి బెదిరిస్తున్నాడు, అందుకే ఆత్మహత్యాయత్నం: టీఆర్ఎస్ విప్ కొడుకుపై ఆరోపణలు
మంచిర్యాల: మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఓ కుటుంబం ఆత్మహత్యకు యత్నించడం కలకలం రేపింది. ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు కుమారుడు నల్లాల క్రాంతి తమను ఆర్థికంగా దెబ్బతీశాడని ఆరోపిస్తూ ఆ కుటుంబం ఆత్మహత్యకు ప్రయత్నించింది.
వివరాల్లోకి వెళ్తే.. పసునూటి అరవింద్ మంచిర్యాలలో షాపింగ్ మాల్స్ సహా పలు వ్యాపారాలు నిర్వహిస్తున్నాడు. అరవింద్కు చెందిన స్వర్ణమయి షాపింగ్మాల్ను 2016 అక్టోబర్లో క్రాంతి రూ. కోటీ 10లక్షలకు కొనుగోలు చేశాడు.
కొనుగోలు చేసి దాదాపు 16నెలలు గడిచిపోయినా.. ఇప్పటికీ డబ్బు ఇవ్వలేదని అరవింద్ ఆరోపిస్తున్నారు. అలాగే ప్రభుత్వం పలు గ్రామాల్లో వేయించిన బోర్వెల్స్ కోసం అరవింద్ తండ్రి సాంబయ్యకు చెందిన బోర్ వెల్ మిషనరీని క్రాంతి ఉపయోగించాడు.
ఇందుకు గాను క్రాంతి నుంచి రూ.2కోట్లు రావాల్సి ఉంది. మొత్తం రూ.3.10కోట్లు క్రాంతి నుంచి రావాలని అరవింద్ చెబుతున్నారు. తమను ఆర్థికంగా ముంచడమే గాక బెదిరింపులకు పాల్పడుతుండటంతో.. భార్య స్వర్ణ, కుమారుడితో కలిసి మంచిర్యాల రైల్వే ట్రాక్ పై ఆత్మహత్యకు యత్నించినట్టు తెలిపారు. స్థానికులు వారిని కాపాడి పోలీసులకు సమాచారం అందించారు.