దక్షిణాది కంటే ఉత్తరాది క్లీన్ స్వీప్ : ఈ 49 సీట్లలో తెరాస గెలవలేదు, ఈసారి సత్తా చూపేనా?
హైదరాబాద్: పద్నాలుగేళ్ల పాటు తెలంగాణ కోసం ఉద్యమించి, సాధించామని తెరాస నేతలు చెబుతారు. కేసీఆర్ 2001లో పార్టీని స్థాపించారు. అప్పటి నుంచి పొత్తుతో 2004, 2009లలో పోటీ చేశారు. అప్పుడు తక్కువ స్థానాల్లో పోటీ చేశారు. ఆ తర్వాత 2014లో అన్ని స్థానాలలో పోటీ చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో 119 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అన్ని నియోజకవర్గాల్లో తెరాసకు బలం ఉంది. పొత్తుల వల్ల అన్ని సీట్లలో పోటీ చేయకపోవడం, 2014లో తెలంగాణ సాధించిన కీర్తి తెరాసతో పాటు ఇచ్చిన కాంగ్రెస్, అందుకు మద్దతు పలికిన బీజేపీకి వెళ్లిపోవడం.. ఇలా పలు కారణాల వల్ల తెరాస ఇప్పటి వరకు తెలంగాణలో 49 సీట్లలో ఖాతా తెరవలేదు. ఇప్పుడు ఖాతా తెరుస్తుందా చూడాలి.
నాలుగు జిల్లాల్లో 36 సీట్లు
ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో తెరాస అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తోంది. మజ్లిస్ పార్టీకి చెందిన ఏడు స్థానాలను వదిలేసుకున్నట్లే. మిగిలిన సీట్లు 112. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ 63 సీట్లలో గెలిచింది. ఇందులో ఎక్కువగా ఉత్తర తెలంగాణలోని అదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాల నుంచి వచ్చాయి. ఈ నాలుగు జిల్లాల్లోనే 44 సీట్లు ఉండగా ఇందులో తెరాస గెలిచింది 36 సీట్లు.
49 సీట్లలో గెలవలేదు
దక్షిణ తెలంగాణలో 75 సీట్లు ఉన్నాయి. ఇక్కడ గెలిచింది మాత్రం 27 సీట్లు. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాల్లోని 39 సీట్లలో తెరాస గెలిచింది ఆరు సీట్లు. తెలంగాణలోని 49 నియోజకవర్గాలలో ఏ ఎన్నికలలోను తెరాస ఒక్కసారి కూడా గెలవలేదు. ఈసారి ఆ సీట్లలోను పాగా వేయాలని చూస్తోంది.
ఉత్తర తెలంగాణలో సీట్లు పెంచుకొని, దక్షిణ తెలంగాణపై పట్టు
2014లో తెరాస దక్షిణ తెలంగాణలో తక్కువ సీట్లు గెలుచుకున్నప్పటికీ, మెదక్ జిల్లాలో మాత్రం స్వీప్ చేసింది. ఉత్తర తెలంగాణలో బలం ఉన్నందున ఇప్పుడు దక్షిణ తెలంగాణపై ఎక్కువగా దృష్టి సారిస్తోంది. ఉత్తర తెలంగాణలో సీట్లు పెంచుకుంటూనే, దక్షిణ తెలంగాణలో పట్టు సాధించుకోవాలని తెరాస చూస్తోంది.
ఈ జిల్లాల్లో గెలిచింది
2014లో తెరాస నిజామాబాద్ జిల్లాలో 9కి 9 సీట్లు గెలిచింది. అదిలాబాద్లో 10 సీట్లలో ఏడు, కరీంనగర్లో 13 సీట్లలో 12, వరంగల్లో 12 సీట్లలో 8, మెదక్లో 10 స్థానాల్లో 8, మహబూబ్ నగర్లో 14 స్థానాల్లో 7, నల్గొండలో 12 స్థానాల్లో 6, హైదరాబాదులో 15 స్థానాలకో 1, ఖమ్మంలో 10 స్థానాలకు 1, రంగారెడ్డిలో 14 స్థానాలకు గాను 4 స్థానాల్లో గెలిచింది.