మీరు చేస్తే సంసారం మేం చేస్తే వ్యభిచారమా .. కాంగ్రెస్ పై రివర్స్ దాడికి దిగిన మంత్రి తలసాని
తెలంగాణా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలంగాణ కాంగ్రెస్ నేతలపై ఎదురు దాడికి దిగారు. కాంగ్రెస్ పార్టీ నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ విరుచుకు పడ్డారు . ఫిరాయింపులపై కాంగ్రెస్ పార్టీకి ప్రశ్నించే అర్హత లేదని ఆయన మండిపడ్డారు . గతంలో ఫిరాయింపులను ప్రోత్సహించినప్పుడు ఆ పార్టీ నేతలకు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా అంటూ అగ్గి మీద గుగ్గిలం అయ్యారు.
సీఎల్పీ విలీనం అభివృద్ధిలో భాగస్వామ్యం కోసమే అన్న మంత్రి తలసాని
సీఎల్పీ విలీనంపై మీడియాతో మాట్లాడిన తలసాని శ్రీనివాస్ యాదవ్ అభివృద్ధిలో భాగస్వామ్యం కోసమే సీఎల్పీ ని టీఆర్ఎస్ఎల్పీ లో విలీనం చేశారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఇక కాంగ్రెస్ నేతలు ఇది ప్రజా స్వామ్యాన్ని ఖూనీ చెయ్యటమే అని చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. మీరు పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించలేదా అని ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ నుంచి గెలిచిన వారిని ఎందుకు కాంగ్రెస్ లోకి లాక్కున్నారని నిలదీశారు. కొండా విశ్వేశ్వరరెడ్డి, ఎమ్మెల్సీ భూపతిరెడ్డి లాంటి వారిని కాంగ్రెస్ ఎందుకు పార్టీలో చేర్చుకున్నారని ఆయన ప్రశ్నించారు.
పార్టీ మారమని అడగాల్సిన అవసరం , ప్రలోభపెట్టే అగత్యం టీఆర్ఎస్ కు లేదన్న తలసాని
ఇందిరాపార్కు వద్ద కాంగ్రెస్ చేపట్టిన రాజ్యాంగం, ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్షను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్రంగా తప్పుపట్టారు. అసలు తెలంగాణా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పట్ల ఎవరికీ విశ్వాసం లేదని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్లో గ్రూప్ రాజకీయాలు ఉన్నాయని, అందుకే ఆ పార్టీని ఎవరూ నమ్మడం లేదని చెప్పారు. టీఆర్ ఎస్ పార్టీ కి ప్రజలు బ్రహ్మాండమైన మెజార్టీ స్థానాలు ఇచ్చారని , ఎవర్నీ పార్టీ మారమని అడగాల్సిన అవసరం టీఆర్ఎస్ పార్టీకి లేదని ఆయన పేర్కొన్నారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్య పరిరక్షణ అని మాట్లాడే కాంగ్రెస్ నేతలు టీఆర్ ఎస్ నుండి నేతలను కాంగ్రెస్ లో చేర్చుకోలేదా అని ప్రశ్నించారు .
మీరు చేస్తే సంసారం మేం చేస్తే వ్యభిచారమా అంటూ కాంగ్రెస్ పై రివర్స్ దాడి చేసిన తలసాని
మీరు చేసినప్పుడు రాజ్యాంగం, ప్రజాస్వామ్య పరిరక్షణ గుర్తు రాలేదా అని ఫైర్ అయ్యారు. మీరు చేస్తే సంసారం.. మేము చేస్తే వ్యభిచారమా? అని నిలదీశారు . ఇక దేశవ్యాప్తంగా కాంగ్రెస్ను ఎవరూ నమ్మడం లేదని తలసాని తెలిపారు. ముఖ్యమంత్రి అన్ని నియోజకవర్గాలను సమానంగా అభివృద్ధి చేస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు. బంగారు తెలంగాణ చేయాలన్న ఉద్దేశంతోనే కేసీఆర్ నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసం రూ.3 కోట్లు కేటాయించారని గుర్తుచేశారు. అధికార పార్టీతో సమానంగా ప్రతిపక్షాలకు కూడా సమానంగా నిధులు కేటాయించినట్లు గుర్తు చేశారు. ఇంతా చేస్తుంది రాష్ట్రాభివృద్ధి కోసమే అని పేర్కొన్నారు.