అసలు విషయం తెలిసింది: కేసీఆర్ ఆశలన్నీ దానిపైనే..!
తెలంగాణలో ఎన్నికల వేడి రోజు రోజుకీ రాజుకుంటోంది. టీఆర్ఎస్, కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుతోంది. నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థాయికి పెరిగిపోయాయి మాటలు. ఇక కేసీఆర్ తన మేనరిజంలో విపక్షాలను టార్గెట్ చేస్తున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ టార్గెట్గానే ఆయన విమర్శలు సాగుతున్నాయి. ఇదిలా ఉంటే కాంగ్రెస్, తెలుగుదేశం, కోదండరాం పార్టీలు కూటమిగా ఏర్పడనుండటంతో కేసీఆర్లో కొంత టెన్షన్ వాతావరణం మొదలైందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అంతేకాదు తాజాగా కేసీఆర్ అంతర్గతంగా చేయించిన సర్వేలో గులాబీ పార్టీకి పాజిటివ్ రిజల్ట్ రాలేదని సమాచారం. దీంతో కారు పార్టీ నేతల్లో కొంత నిరాశ కనిపించిందనే చెప్పుకోవాలి.
ప్రభుత్వం రద్దు...ఆపై అభ్యర్థుల ప్రకటింపు
కేసీఆర్ ఏ పని ప్రారంభించిన మంచి ముహూర్తం, గ్రహబలం చూసుకోనే ప్రారంభిస్తారు. అంతేకాదు తన ప్రభుత్వాన్ని రద్దు చేసే సమయంలో కూడా కచ్చితంగా తన లక్కీ నంబర్ 6ను అనుసరించే సెప్టెంబర్ 6వ తేదీన ప్రభుత్వాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అదే రోజు ఆయన తెలంగాణ భవన్లో తన పార్టీకి సంబంధించి 105 మంది అభ్యర్థులను ప్రకటించారు. ఇందులో ఒకరిద్దరు తప్పితే అంతా సిట్టింగ్ ఎమ్మెల్యేలే ఉన్నారు. ఇదే ఇప్పుడు కేసీఆర్ కొంపముంచనుందా.. అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది.
టీఆర్ఎస్పై మహాకూటమి ఎఫెక్ట్
మొదట్లో కేసీఆర్ 90కి పైగా సీట్లు గెలుస్తామంటూ ధీమా వ్యక్తం చేశారు. ఆ తర్వాత పలు బహిరంగసభల్లో ఆయన 100కు పైగా సీట్లు గెలుస్తామంటూ ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. అది కూడా చాలా బలంగానే చెప్పారు. తెలంగాణలో మొత్తం 119 స్థానాలుంటే కేసీఆర్ చెప్పినట్లుగా 110 స్థానాలు టీఆర్ఎస్ గెలుస్తుంది అనుకుంటే... హైదరాబాద్ నగరంలో ఎటు తిరిగి ఏడు సీట్లు మజ్లిస్ పార్టీ గెలుస్తుంది. ఇక్కడికే 117 స్థానాలు పూర్తయ్యాయి. ఇక మిగతా రెండు సీట్లు ఏ పార్టీ గెలుస్తుందనే చర్చ ప్రారంభమైంది. ఇక మహాకూటమి ఏర్పడటంతో కేసీఆర్ తాము గెలుస్తామని చెప్పిన సీట్ల సంఖ్య తగ్గుతూ వస్తున్నట్లు గులాబీ వర్గాలే చెబుతున్నాయి. ఇప్పుడు బరిలో దిగనున్న నేతల్లో కూడా ఇదే తరహా టెన్షన్ నెలకొంది.
కేసీఆర్కు షాక్ ఇచ్చిన అంతర్గత సర్వే
గులాబీ అధినేత కేసీఆర్ అంతర్గతంగా సర్వే చేయించినట్లు తెలుస్తోంది. ఇందులో ఆయనకు షాకింగ్ రిజల్ట్ వచ్చిందట. టీఆర్ఎస్ పార్టీ గెలుపు ఎడ్జ్లో ఉన్నట్లు సమాచారం. ఒకవేళ గెలిచినా కేసీఆర్ లేదా టీఆర్ఎస్ నాయకులు చెబుతున్నట్లు మరీ అంత భారీ తేడాతో ఉండదని సర్వే వెల్లడించిందట. ఇందుకు కారణం మహాకూటమే అని సమాచారం. కూటమి గులాబీ కోటను కూల్చే ఛాన్సులు కూడా ఉన్నాయట. అందుకే కేసీఆర్ తన మేనిఫెస్టోలో విపరీతమైన వరాలు కురిపించినట్లు సమాచారం. ఉదాహరణకు వికలాంగులకు రూ.3016, నిరుద్యోగ భృతి రూ.3016 ఇలాంటి హామీలు అందుకే ఇచ్చారని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.
సిట్టింగ్ ఎమ్మెల్యే స్థానాలే కేసీఆర్ కొంప ముంచనున్నాయా..?
ఒక వేళ టీఆర్ఎస్ ఓటమి అంచుల్లో ఉంది ఉంటే అందుకు కారణం సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వడమే అని సర్వే వెల్లడించింది. సెప్టెంబర్ 6న ప్రభుత్వాన్ని రద్దు చేసి ఆరోజే 105 మందికి టికెట్లు ఇస్తున్నట్లు ప్రకటించి కేసీఆర్ తొందరపాటు నిర్ణయం తీసుకున్నారా అనే చర్చ రాజకీయ వర్గాల్లో ప్రారంభమైంది. ఇప్పటికీ ఆ సీట్లు ప్రకటించి దాదాపు 45 రోజులు కావొస్తున్నప్పటికీ ఇంకా 14 సీట్లకు అభ్యర్థులను కేసీఆర్ ప్రకటించలేదు. దీంతో క్యాడర్లో కూడా కాస్త నిరుత్సాహం కనిపిస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో చాలామందిపై ప్రజలు వ్యతిరేకతతో ఉన్నారు. మరి ఎన్నికలు వస్తే వారిని ఓడించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రజలు చెబుతున్నారని విపక్ష పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
Recommended Video
టీఆర్ఎస్ నేతల్లో అసంతృప్తులు.. మహాకూటమి పైనే కేసీఆర్ ఆశలు
కేసీఆర్ ఆశలన్నీ ఇప్పుడు విపక్షపార్టీలతో ఏర్పాటు కానున్న కూటమిపైనే ఉన్నాయి. కూటమి ఏర్పాటు సందర్భంగా లేదా సీట్ల సర్దుబాటు విషయంలో ఏదైనా పార్టీ అసంతృప్తి వ్యక్తం చేస్తే అది క్యాష్ చేసుకోవాలనుకుంటున్నారు కేసీఆర్. ఇప్పుడు మహాకూటమి గురించి కేసీఆర్ ఎదురుచూస్తున్నారు. కూటమి ఏర్పాటు తర్వాత తన రాజకీయ చతురతను ప్రదర్శించే అవకాశం ఉంది. అంతేకాదు టీఆర్ఎస్లో కూడా టికెట్ ఆశించి భంగపడ్డవారు కూడా అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యేకు సహకరించే పరిస్థితి కనిపించడం లేదు. బయటకు తమ సహకారం ఉందని ఎంత చెప్పినప్పటికీ తమ పని తాము చేసుకుని పోయే అవకాశం ఉంది. ఇవన్నీ టీఆర్ఎస్ పార్టీకి నెగిటివ్గా మారి గెలుపోటములను డిసైడ్ చేయనున్నాయి.