అనూహ్యమార్పులు ఖాయం!: తెలంగాణలో విజయం ఎవరిది? కేసీఆర్ గ్రహబలం ఏం చెబుతోంది?
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో విజయం ఎవరిది అనే చర్చ జోరుగా సాగుతోంది. టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతృత్వంలోని మహాకూటమి గెలుపుపై చాలా ధీమాగా ఉన్నాయి. తమకు వంద సీట్లు ఖాయమని తెరాస చెబుతుంటే, తమకు 70 నుంచి 80 సీట్లు తప్పకుండా వస్తాయని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.
ప్రజల్లో డైలమా
కానీ ప్రజల్లో మాత్రం డైలమా ఉంది. ఓటింగ్ ముగిసినప్పటి నుంచి మీడియాలో, సోషల్ మీడియాలోనే కాకుండా ఏ ఇద్దరు కలిసినా ఎవరు గెలుస్తారనే చర్చ సాగుతోంది. ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారనే విషయమై అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మంగళవారం నాడు ఫలితాలు రానున్నాయి.
జ్యోతిష్య పండితులు ఏం చెప్పారంటే
ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల్లో నిలబడిన అభ్యర్థులు మరియు ముఖ్య నాయకుల గ్రహ గోచారరీత్యా జ్యోతిష్యం ఆధారంగా పరిశీలించి కూడా చూస్తున్నారు. ఇందులో భాగంగా ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష్య పండితులు, పీహెచ్డీ గోల్డ్ మెడలిస్ట్ డా.ఎం.ఎన్.చార్య పార్టీల గెలుపోటములపై వారి వారి గ్రహగోచార రీత్యా ఎలా ఉంటుందో వెల్లడించారు.
తెరాసకు 60 నుంచి 70 సీట్లు
ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, తెరాస అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు వ్యక్తిగత జాతకం ఆధారంగా వారి గ్రహబలం, గోచార బలం ఆధారంగా ఎన్ని సీట్లలో తెరాస విజయకేతనం ఎగురవేస్తుందనే విషయాన్ని వెల్లడించారు. కేసీఆర్ గోచార బలం ఆధారంగా లెక్కలేసిన డా.ఎం.ఎన్.చారి తెరాసకు 60 నుంచి 70 సీట్లు వస్తాయని, తద్వారా వారే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని పేర్కొన్నారు.
అనూహ్య మార్పులు
అలాగే, రాష్ట్ర రాజకీయాలలో అనూహ్యమైన మార్పులు, చేర్పులు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలో అందరి నాయకుల వ్యక్తిగత జాతక వివరాలు పూర్తిగా అందుబాటులో లేనందున ఫలితాలు తెలియజేయడం లేదు. కానీ కేసీఆర్ జాతకరీత్యా ఆయనకు బాగున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుత గ్రహ సంచారంతో పరిస్థితులు చక్కబడి అది వారి విజయానికి దోహదం చేస్తుందని తెలిపారు. జ్యోతిష్యం ఆధారంగా చూస్తే తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత అయిన కేసీఆర్ రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని తేలిందని చెబుతున్నారు.