కేకే అధ్యక్షతన కమిటీ ఏర్పాటు: '5 లక్షల కన్నా ఎక్కువ ఖర్చుపెట్టొద్దు'
హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార పార్టీ టీఆర్ఎస్ తమ వ్యూహాలు రచిస్తోంది. తాజాగా సోమవారం ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియ కోసం ఐదుగురు సభ్యులతో కూడిన ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు.
ఈ కమిటీలో టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు అధ్యక్షతన, ప్రభుత్వ ముఖ్య సలహాదారు డి.శ్రీనివాస్, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రులు కేటీఆర్, ఇంద్రకరణ్రెడ్డి సభ్యులుగా ఉన్నారు. పార్టీ నేతలతో సంప్రదింపులు జరిపిన అనంతరం ఈ కమిటీ అభ్యర్ధులను కేసీఆర్ ఎంపిక చేశారు.
గ్రేటర్లో అభ్యర్ధుల ఎంపిక నిష్పాక్షికంగా జరిగేందుకు వీలుగా నగరానికి చెందిన మంత్రులకు ఈ కమిటీలో చోటు కల్పించలేదని తెలుస్తోంది. అభ్యర్ధుల ఎంపిక పారదర్శకంగా జరగాలని, పార్టీ సర్వేలను ప్రామాణికంగా తీసుకోవాలని సీఎం కేసీఆర్ ఈ కమిటీకి సూచించినట్లు సమాచారం.
రూ.5 లక్షల కన్నా ఎక్కువ ఖర్చుపెట్టొద్దు: జీహెచ్ఎంసీ కమిషనర్
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు రూ.5లక్షల కన్నా ఎక్కువ ఖర్చు పెట్టొద్దని జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్రెడ్డి ఆయా పార్టీల నేతలకు సూచించారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో పలు పార్టీల నేతలతో సోమవారం ఆయన భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల ఖర్చు నియంత్రణపై పార్టీల నేతలతో చర్చించారు. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు రూ.5లక్షల కన్నా ఎక్కువ ఖర్చుచేయవద్దని సూచించారు. అయితే అభ్యర్థులతో సంబంధం లేకుండా పార్టీలు అదనపు ఖర్చు పెట్టవచ్చన్నారు.
ఎన్నికల సందర్భంగా అభ్యర్ధులు పెట్టిన ఖర్చు వివరాలను ఎన్నికల కమిషన్ కార్యాలయానికి అందజేయాలని ఆయన సూచించారు. ఎన్నికల ఖర్చు నియంత్రించేందుకు 30మంది పర్యవేక్షకులను నియమించినట్టు ఆయన చెప్పారు. అన్ని పార్టీల హోర్డింగులు, ఫ్లెక్సీలను తొలగిస్తామని ఈ సందర్భంగా ఆయన చెప్పారు.