ఫిబ్రవరి 7న టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం .. పార్టీ బలోపేతం ,కీలక అంశాలపై కేసీఆర్ ఫోకస్
టిఆర్ఎస్ పార్టీ అధినేత కెసిఆర్ తెలంగాణ రాష్ట్రంలో పార్టీ పటిష్టత, పార్టీ నిర్మాణంపై దృష్టిసారించారు. ఈ మేరకు తెలంగాణ సీఎం కేసీఆర్ ఈనెల ఏడవ తేదీన తెలంగాణ భవన్లో టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని జరపాలని నిర్ణయించారు. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయాలని, క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితిని పార్టీ నాయకులతో చర్చించాలని నిర్ణయించిన కేసీఆర్ ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు కార్యవర్గ సమావేశం నిర్వహించనున్నారు.
రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి రాష్ట్ర కమిటీ సభ్యులు, రాష్ట్ర మంత్రులు, లోక్సభ రాజ్యసభ సభ్యులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ ల చైర్ పర్సన్లూ, జిల్లా పరిషత్ చైర్ పర్సన్లూ, మునిసిపల్ మేయర్లు, డిసిసిబి అధ్యక్షులు, డీసీఎంఎస్ అధ్యక్షులను రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ఆహ్వానించారు.
రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పార్టీ అధ్యక్షుడు ఎన్నిక, పార్టీ సభ్యత్వ పునరుద్ధరణ కార్యక్రమం, గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ కమిటీల నియామకం పై ప్రధానంగా చర్చ జరగనుంది.
అంతేకాదు ఏప్రిల్ 27వ తేదీన నిర్వహించ తలపెట్టిన వార్షిక మహాసభ నిర్వహణపై కూడా ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇతర సంస్థాగత అంశాలపై కూడా ప్రధానంగా చర్చ జరిపి పార్టీని క్షేత్ర స్థాయి నుండి బలోపేతం చేయడానికి చేయవలసిన కార్యాచరణను కూడా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసే అవకాశముంది. సీఎం కేసీఆర్ ఆదివారం నాడు నిర్వహించ తలపెట్టిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంటారని పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతుంది.