అచ్చోసిన ఆంబోతుల్లా మంత్రులను వదిలారు .. బ్లాక్ మెయిల్ ఆయుధంగా గెలిచారు : రేవంత్ ఫైర్
తెలంగాణా రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలలో టీఆర్ఎస్ కాంగ్రెస్, బీజేపీలకు షాక్ ఇచ్చింది. ఇక ఈ విజయాన్ని టీఆర్ ఎస్ శ్రేణులు సెలబ్రేట్ చేసుకుంటుంటే కాంగ్రెస్ , బీజేపీలు మాత్రం అధికార టీఆర్ఎస్ పై దుమ్మెత్తిపోస్తున్నాయి. ఇక నేడు ఎన్నికల ఫలితాల నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పై నిప్పులు చెరిగారు.
ప్రజలు ఛీ కొట్టారు ..కాంగ్రెస్, బీజేపీలు తెలంగాణలో బోర్డులు తిప్పేయాలి: ఎర్రబెల్లి దయాకర్ రావు
ఎన్నికల ఫలితాలపై మాట్లాడిన రేవంత్ రెడ్డి
హైదరాబాద్ లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణా ఎన్నికల ఫలితాల గురించి ఎన్నో విషయాలు ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉందని అందుకే టీఆర్ఎస్ పార్టీ చేసిన అరాచకాలు చెప్తున్నామని పేర్కొన్నారు. ఏ స్థాయి ఎన్నికల్లో అయినా కాంగ్రెస్ పార్టీ ఎన్నో విజయాలు చూసిందని , అలాగే ఒడిదుడుకులను సైతం చూసిందని టీ-కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి అన్నారు.
ఏ ఎన్నికలైనా కేసీఆర్ ఎన్నుకున్న ఆయుధం బ్లాక్ మెయిల్
ఏ ఎన్నికల్లో అయినా తెలంగాణా సీఎం కేసీఆర్ ఎన్నుకున్న ఆయుధం బ్లాక్ మెయిల్ అని రేవంత్ రెడ్డి ఆరోపించారు. సీఎం కేసీఆర్ మున్సిపల్ ఎన్నికల్లో ఓడిపోతే మంత్రి పదవులు పోతాయని బెదిరిస్తే , ఇక ఆ మంత్రులు అచ్చోసిన ఆంబోతుల్లా వారిని ప్రజలపైన పడ్డారని మండిపడ్డారు. ముఖ్యంగా ఈ ఆంబోతులు ప్రజలపై, ప్రతిపక్షాలపై, ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల మీద దాడులు, బెదిరింపులకు పాల్పడి ఎన్నికల్లో గెలిచేందుకు ప్రయత్నం చేశారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
డబ్బు, పోలీసులు, మద్యం, ఎన్నికల నిర్వహణ అధికారులు .. విజయానికి కారణం ఇవే
ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పెట్టిన పెట్టుబడి డబ్బు, పోలీసులు, మద్యం, ఎన్నికల నిర్వహణ అధికారులు అని ఆరోపించారు. ఇక వీటి సాయంతోనే కేసీఆర్ పని చేశారని, కార్యకర్తలను ఏ మాత్రం నమ్ముకోలేదని, కేవలం దౌర్జన్యం చేసి విజయం అని చెప్పుకుంటున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు . ప్రజాస్వామ్యాన్ని బతికించడానికి కొన్ని చోట్ల స్వతంత్రులకు మద్దతిచ్చామని తెలిపారు. రాబోయే రోజుల్లో మరింత పుంజుకుంటామని రేవంత్ ధీమా వ్యక్తం చేశారు.
పోలీసులు , ఎన్నికల అధికారులు కేసీఆర్ కు తొత్తులుగా వ్యవహరించారని ఫైర్
ఎన్నికల నిర్వహణ తీరు కూడా సరిగా లేదని రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు. ఎన్నికల ప్రక్రియ ప్రకటన విడుదల నుంచి ఎన్నికల తేదీలు, రిజర్వేషన్ల కేటాయింపు, ఓట్ల లెక్కింపు, ఎన్నికల ఫలితాలు ఇలా అన్ని అంశాల్లో నియమనిబంధనలను తుంగలో తొక్కి కేసీఆర్ కు తొత్తులుగా వ్యవహరించారని రేవంత్ విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణంగా నష్టం చేకూర్చే విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరించిందని ఆగ్రహం వ్యక్తం చేసిన రేవంత్ పోలీసుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు . అంతేకాదు పోలీసులపై ఎన్నికల సంఘానికి, పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.