టార్గెట్ 2019: బలమైన నేతలెక్కడ, ఓటింగ్పై టిఆర్ఎస్ ఆరా
2019 ఎన్నికల కోసం టిఆర్ఎస్ నాయకత్వం కసరత్తు చేస్తోంది.గ్రామాలు, మండలాల్లో బలమైన నాయకుడెవరు, ఏయే అంశాలు ఓటింగ్పై ప్రభావం చూపుతాయనే విషయాలపై సర్వే సాగుతోంది.
హైదరాబాద్: 2019 ఎన్నికల కోసం టిఆర్ఎస్ నాయకత్వం కసరత్తు చేస్తోంది.గ్రామాలు, మండలాల్లో బలమైన నాయకుడెవరు, ఏయే అంశాలు ఓటింగ్పై ప్రభావం చూపుతాయనే విషయాలపై సర్వే సాగుతోంది. పోలీసు శాఖ అత్యంత పకడ్బందీగా ఈ సమాచారాన్ని సేకరిస్తోందని తెలుస్తోంది.
కమ్మ సమ్మేళనానికి కెసిఆర్ ప్లాన్: పాత మిత్రులంతా టిడిపికి షాకిస్తారా?
2014 ఎన్నికలకు 2019 ఎన్నికలకు మధ్య వ్యత్యాసం ఉంటుంది. 2014లో తెలంగాణ రాష్ట్రం తెచ్చిన సందర్భాన్ని పురస్కరించుకొని జరిగిన ఎన్నికలు. ఈ ఎన్నికల్లో టిఆర్ఎస్కు ఓటర్లు పట్టం కట్టారు.
అయితే 2019 ఎన్నికల నాటికి ఓటర్ల నాడి మారే అవకాశం ఉంటుంది.ఈ ఐదేళ్ళ కాలంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఏం చేసిందనే విషయాలు కూడ ఓటింగ్పై ప్రభావం చూపే అవకాశాలు లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
దీంతో టిఆర్ఎస్ వ్యూహత్మకంగా అడుగులు వేస్తోంది. ఓటర్లపై ప్రభావం చూపే అన్ని అంశాలపై అధికార పార్టీ ఆరా తీస్తోంది. దీనికితోడు ఓటర్లపై ప్రభావం చూపే నాయకులు ఎవరనే విషయాలపై కూడ టిఆర్ఎస్ నాయకత్వం ఆరా తీస్తోందని సమాచారం.
బలమైన నాయకుల కోసం సర్వే
బలమైన నాయకుడు ఎవరు!? ఎక్కువ మందిపై ప్రభావం చూపగలిగిన నాయకుడు ఎవరు!? ఎక్కువ ఓట్లు కలిగిన సామాజిక వర్గం ఏది!? ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే గెలుపు గుర్రం ఎక్కేది ఎవరు!? ఇటువంటి ప్రశ్నలు ఉన్న ఓ జాబితా పట్టుకుని పోలీసులు ఇప్పుడు గ్రామాల్లో తిరుగుతున్నారు. నాయకుల కోసం అన్వేషిస్తున్నారు. రాష్ట్ర రాజకీయ చరిత్ర లో ఎన్నడూ లేని విధంగా ఓటర్లను ప్రభావితం చేసే ప్రతి అంశంపైనా కేసీఆర్ సర్కార్ తీవ్ర కసరత్తు చేస్తోంది. గ్రామం మొదలుకొని మండల, నియోజక వర్గ, జిల్లా స్థాయి వరకూ ప్రధాన రాజకీయ పార్టీల్లో ఉన్న నాయకుల పూర్తి వివరాలను సేకరిస్తున్నారు.
నేతల చరిత్రపై ఆరా
గ్రామ స్థాయిలో ఉన్న నాయకులు ప్రస్తుతం ఏ పార్టీలో ఉన్నారు? వారి పూర్వ రాజకీయ జీవితం, అనుభవించిన పదవులు, సామాజిక వర్గం, ఆర్థిక వనరులు, విద్యార్హత, కుటుంబ చరిత్ర తదితర అంశాలను సేకరిస్తున్నారు. అధికార, విపక్షం అనే తేడా లేకుండా గ్రామం మొదలు జిల్లా వరకు ఉన్న నాయకుల చరిత్రను నిఘా వర్గాలు సేకరిస్తున్నాయి. .విశ్వసనీయ సమాచారం మేరకు.. పోలీసులు రహస్యంగా ఈ సర్వే వివరాలు సేకరిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పని చేస్తున్న ఎస్సైలందరికీ వారం కిందటే నిర్దిష్ట ఫార్మాట్ను ఉన్నతాధికారులు పంపారు.
గ్రామపంచాయితీల వారీగా సమాచార సేకరణ
వీలైనంత త్వరగా ఎస్సైల పరిధిలోని గ్రామాల వివరాలను ఫార్మాట్ ప్రకారం సేకరించి పంపాలని ఆదేశాలిచ్చారు. గ్రామ పంచాయతీ యూనిట్గా ఈ వివరాలను ఎస్సైలు సేకరిస్తున్నారు. కేసుల విచారణ పేరుతో, యువతతో సన్నిహితంగా ఉంటూ వివరాలను సేకరిస్తున్నారు. ముఖ్యంగా ఆ గ్రామంలో రాజకీయాల్లో క్రియాశీలంగా ఉన్నవారెవరు? ఏయే పార్టీల తరఫున వారు పని చేస్తున్నారు. రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్లుగా, ఎంపీటీసీగా పోటీ చేసే ఆలోచన ఉన్నవారెవరు? ఎక్కువ ప్రజాదరణ కలిగిన నాయకుడు ఎవరు?బలమైన సామాజికవర్గమేంటి? సర్పంచ్గా, ఎంపీటీసీ సభ్యుడిగా పోటీ చేయకున్నా గ్రామంలో ప్రజలను ప్రభావితం చేసే వ్యక్తులున్నారా? అనే విషయాలపై సమాచారాన్ని సేకరిస్తున్నారు.
బలమైన నేతలు ఏ పార్టీలో ఉన్నారు
బలమైన నాయకులు ప్రస్తుతం ఏ పార్టీలో ఉన్నారు? మహిళా సంఘాల నాయకులు సర్పంచ్ పదవికి పోటీ చేసే పలుకుబడిని సంపాదించారా? బలమైన నాయకుల ఆర్థిక స్థితిగతులు ఎలా ఉన్నాయి తదితర కీలక, సూక్ష్మ సమాచారాన్ని సర్వేలో పోలీసులు సేకరిస్తున్నట్లు తెలిసింది. సర్వేతో గ్రామాల్లో ఉన్న నాయకత్వంపై ప్రభుత్వం పూర్తిస్థాయిలో దృష్టిసారించిందని విశ్లేషకులు వివరిస్తున్నారు. గ్రామాల్లో బలమైన జనాదరణ కలిగిన నాయకులను గుర్తించి, వారిని తమవైపు తిప్పుకునే క్రమంలోనే ఈ వివరాల సేకరణ జరుగుతుండవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.