పెంచేది అనుమానమే..! కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలనుకుంటున్న టీఆర్ఎస్
హైదరాబాద్ : పది జిల్లాల తెలంగాణ కాస్త ముప్పై ఒక్క జిల్లాల రాష్ట్రంగా అవతరించడంతో.. తెలంగాణ రాజకీయ ముఖచిత్రం కొత్త మలుపు తీసుకుంటుందనేది ప్రతీ ఒక్కరి భావన. కొత్త నియోజకవర్గాలు అందుబాటులోకి వస్తే.. కొత్త ముఖాలు కూడా రాజకీయ రంగప్రవేశం చేసే అవకాశం లేకపోలేదు.
మరోవైపు కొత్త నియోజకవర్గాల పెంపు టీఆర్ఎస్ కు అనివార్యం. వచ్చే ఎన్నికల్లో ఇప్పుడున్న ఎమ్మెల్యే, ఎంపీలతో పాటు ఆశావహులను సంతృప్తి పరచడం టీఆర్ఎస్ కు ఓ సవాల్ లాంటిదే. ఇదంతా జరగాలంటే ముందు నియోజకవర్గాల పెంపు జరగాలి. లేదంటే.. ఎవరికి టికెట్ ఇవ్వాలో.. ఎవరికీ 'నో' చెప్పాలో తెలియని పరిస్థితి పార్టీలో గందరగోళానికి గురిచేసే అవకాశముంది. కాబట్టి ఇప్పటినుంచే దీనిపై ఫోకస్ చేసిన టీఆర్ఎస్.. నియోజక వర్గాల పెంపు విషయమై కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలనే యోచనలో ఉంది.
ఇందుకోసం టీఆర్ఎస్ ఎంపీలంతా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడానికి సిద్దమవతుంటే.. సీఎం కేసీఆర్ కూడా ఈ ప్రతిపాదనను ఓకె చేయించుకోవడానికి మోడీని కలవబోతున్నారని చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం 119 నియోజకవర్గాలున్న తెలంగాణలో.. కొత్త జిల్లాల ఏర్పాటుతో ఆ స్థానాలు 153వరకు పెరిగే అవకాశముంది. ప్రతిపక్షాల నుంచి పార్టీలో చేరినవారు.. ముందునుంచి పార్టీకి విధేయులుగా పనిచేసినవారిని ఇరువురిని సంతృప్తి పరుస్తూ టీఆర్ఎస్ టికెట్ల పంపిణీ చేయాల్సి ఉంటుంది.
అలా కానీ పక్షంలో టీఆర్ఎస్ లో అసంతృప్త స్వరాలు గూడుకట్టుకునే అవకాశం లేకపోలేదు. మొత్తంగా నియోజకవర్గాల పెంపు అనేది జరిగితేనే ఇదంతా సాధ్యపడే విషయం. అయితే కేంద్రం మాత్రం నియోజకవర్గాల పెంపుకు ఇప్పుడే గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లోను ఈ డిమాండ్ ఉన్న నేపథ్యంలో.. నియోజకవర్గాల పెంపుపై ఆచీ తూచీ వ్యవహరించాలని కేంద్రం భావిస్తున్నట్టుగా సమాచారం.