ట్రక్కు-కారు గుర్తు: కేసీఆర్ ఫిర్యాదుపై స్పందించిన ఈసీ, ఏం జరిగిందంటే?
న్యూఢిల్లీ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఫిర్యాదుపై కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం స్పందించింది. గత డిసెంబర్ నెలలో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో తమ పార్టీ గుర్తు కారును పోలిన మరికొన్ని ట్రక్కు వంటి గుర్తులు తమను దెబ్బతీశాయని పేర్కొన్నారు.
దీనిపై ఈసీకి ఫిర్యాదు చేశారు. కారు గుర్తును పోలిన గుర్తులపై ఫిర్యాదు, కారు గుర్తు బోల్డ్ చేయడాన్ని ఈసీ దృష్టికి తీసుకు వెళ్లారు. దీనిపై స్పందించిన ఎన్నికల సంఘం కారు గుర్తు బోల్డ్ చేయడంపై సూచనలు కోరింది. దీంతో కరీంనగర్ ఎంపీ వినోద్ కుమార్ మార్పు చేసిన కారు గుర్తుని ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించారు.
ఈ సందర్భంగా ఎంపీ వినోద్ మీడియాతో మాట్లాడారు. ఈవీఎంలలో కారు గుర్తు సరిగా కనిపించలేదని, దీంతో వృద్ధులు, కంటిసమస్య ఉన్నవారు ఇబ్బంది పడ్డారని తెలిపారు. సమాజ్వాది ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ట్రక్కు గుర్తు తమ కారు గుర్తును పోలి ఉందని తెలిపారు. ట్రక్కు గుర్తు వల్ల తమ పార్టీ అభ్యర్థులు చాలా నియోజకవర్గాల్లో ఓటమి పాలయ్యారన్నారు. అభ్యర్థుల పేర్లు కూడా ఒకేలా ఉండేలా ఆ పార్టీ ఓటర్లను గందరగోళానికి గురి చేసిందని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పరిస్థితి, పార్లమెంటు ఎన్నికల్లో దొర్లకుండా చూడాలని కోరినట్లు తెలిపారు.
కాగా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్వాది ఫార్వర్డ్ బ్లాక్ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం ట్రక్కు గుర్తును కేటాయించింది. ఆ పార్టీ ముప్పై నియోజకవర్గాల్లో పోటీ చేసింది. ఆ పార్టీ అభ్యర్థులు పోటీలో లేనిచోట్ల స్వతంత్ర అభ్యర్థులకు ట్రక్కు గుర్తును కేటాయించారు. టీఆర్ఎస్ ఎన్నికల గుర్తు కారు, సమాజ్వాదీ ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఎన్నికల గుర్తు ట్రక్కు ఈవీఎంలలో ఒకేలా కనిపిస్తున్నాయని, గ్రామీణ ఓటర్లు గందరగోళానికి గురవుతున్నారని టీఆర్ఎస్ అప్పుడే ఆందోళన వ్యక్తం చేసింది.