ప్రగతి నివేదన సభ: కేటీఆర్ గురించి కేసీఆర్ కీలక ప్రకటన చేస్తారా!?
Recommended Video
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి ప్రగతి నివేదన సభలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఏం మాట్లాడుతారనే ఆసక్తి అందరిలోను నెలకొంది. ముఖ్యంగా ముందస్తు ఎన్నికలు, అసెంబ్లీ రద్దుపై ఉత్కంఠకు తెరపడనుందని భావిస్తున్నారు. అదే సమయంలో మరో చర్చ కూడా సాగుతోంది.
మంత్రి కేటీఆర్కు ప్రమోషన్ ఉంటుందా, ఆయనపై ఏమైనా ప్రకటన చేస్తారా అనే చర్చ కూడా సాగుతోంది. ఈ భారీ సభకు కేటీఆర్ అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. సభను విజయవంతం చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. గతంలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కేటీఆర్ అన్నీ తానై ప్రచారం సాగించి, పార్టీని విజయపథంలో నడిపించారు.
గ్రేటర్ ఎన్నికల్లో తెరాస 150 డివిజన్లకుగాను 99 స్థానాల్లో గెలిచింది. కేటీఆర్ ప్రచారం, వ్యూహ చతురత కారణంగా అన్ని స్థానాల్లో గెలిచామని తెరాస చెప్పుకుంది. ఈ నేపథ్యంలోనే, రాబోయే ఎన్నికలకు సమరశంఖంగా భావిస్తున్న ప్రగతి నివేదన సభలో కేటీఆర్ను ఉద్దేశించి కేసీఆర్ ఏదైనా కీలక ప్రకటన చేస్తారా? అనే చర్చ సాగుతోంది.
గ్రేటర్ ఎన్నికల తర్వాత కేసీఆర్.. కేటీఆర్కు కీలకమైన మున్సిపల్ శాఖను అప్పగించారు. అలాగే ఇప్పుడు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ప్రగతి నివేదన సభ బాధ్యతనూ మంత్రి కేటీఆర్కే అప్పగించారు. తాను నిర్వర్తిస్తున్న శాఖలపరంగానే కాకుండా, రాజకీయంగా సమర్థతను మరోసారి నిరూపించుకున్న కేటీఆర్ ఖాతాలో ఈ సభ విజయం పడుతుందని చెబుతున్నారు.
సభకు భారీ భద్రత
కొంగర కలాన్ వద్ద ఆదివారం సాయంత్రం నిర్వహిస్తున్న ప్రగతి నివేదన సభకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సభ జరగబోయే ప్రాంతంతో పాటు పరిసరాల్లో పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు. ఇరవై వేల మంది సిబ్బంది, అధికారులు భద్రతా విధులు నిర్వహిస్తున్నారు. సభ పరిసర ప్రాంతాల్లో ఎక్కడ ఏం జరిగినా వెంటనే తెలుసుకునేందుకు వీలుగా అత్యాధునికమైన 200 సీసీ కెమారాలు ఏర్పాటు చేస్తున్నారు.
ప్రత్యేకంగా 43 కెమెరాలు 360 డిగ్రీల కోణంలో నిరంతరం తిరుగుతూ ఉండేలా సిద్దం చేశారు. సభా ప్రాంగణంలోకి ప్రవేశించిన ప్రతి వ్యక్తి ఈ కెమెరాల్లో కనిపిస్తాడు. పోలీసు అధికారులు ఎప్పటికప్పుడు కమాండ్ కంట్రోల్ కేంద్రంలో దృశ్యాలను పరిశీలిస్తున్నారు. సభ జరుగుతున్న తీరును నిరంతరం వీక్షించేందుకు వీలుగా పోలీస్ ఉన్నతాధికారుల కోసం ప్రత్యేక మొబైల్ యాప్ను రూపొందించారు.