రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ సీనియర్ నేత ప్రశంసల వర్షం..ఆసక్తికర చర్చ
కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యుడు రేవంత్ రెడ్డి పై శాసనమండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్ ప్రశంసల జల్లు కురిపించటం తెలంగాణ రాజకీయ వర్గాలలో ఆసక్తికర చర్చకు కారణమవుతోంది. హైదరాబాద్ బోయినపల్లి లో జరిగిన సర్వాయి పాపన్న విగ్రహ ఆవిష్కరణ సభలో మాట్లాడిన స్వామి గౌడ్ రేవంత్ రెడ్డిని ఒక రేంజ్ లో పొగిడారు.
రేవంత్ గొప్పతనాన్ని ఆకాశానికి ఎత్తేసారు. రేవంత్ రెడ్డి రెడ్డి సామాజిక వర్గం లో పుట్టినప్పటికీ ఆయన బడుగు బలహీన వర్గాలకు ఊతమిచ్చారని, బడుగు బలహీన వర్గాల చేతి కర్ర గా నిలిచారని స్వామిగౌడ్ వ్యాఖ్యానించారు.అలాంటి వారిని మనం గుర్తించి, వారికి అండగా నిలవాలని పేర్కొన్నారు. అంతేకాదు తెల్ల బట్టల వారికి అమ్ముడు పోవద్దని పరోక్షంగా వ్యాఖ్యానించారు.
2500 కోట్లు ఉన్న వ్యక్తిని ఒక పార్టీ నిలబెడితే, 3500 కోట్లు ఉన్న వ్యక్తిని మరోపార్టీ నిలబెడుతుందని, పది మందిని చంపిన వాడిని ఒక పార్టీ నిలబడితే, మరో పార్టీ 15 మందిని చంపిన వాడిని నిలబెడుతుందని.. ఇలాంటి రాజకీయాలు పోవాలి అంటూ స్వామి గౌడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఇదే సమయంలో రేవంత్ రెడ్డి సైతం స్వామి గౌడ్ ను ప్రశంసించారు. ఉద్యోగ సంఘాల నేత గా ఉద్యమాన్ని ముందుకు నడిపించారని, పార్టీలు వేరైనా సిద్ధాంతాలు వేరైనా ఉద్యమ స్ఫూర్తిని గుర్తుంచుకోవాల్సిందే అని ఆయన పేర్కొన్నారు. ఒకప్పుడు తెలంగాణ ఉద్యమంలో స్వామిగౌడ్ పై దాడి చేసిన అధికారులే ఇప్పుడు కీలక పదవులలో ఉన్నారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
ప్రతిపక్ష పార్టీలో ఉన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఎలా ఉన్నా,రేవంత్ రెడ్డి అంటేనే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అగ్గిమీద గుగ్గిలం అవుతారు. అలాంటి రేవంత్ రెడ్డికి కితాబిస్తూ స్వామి గౌడ్ చేసిన వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. టిఆర్ఎస్ పార్టీపై స్వామిగౌడ్ తీవ్ర అసహనంతో ఉన్నట్లుగా మాట్లాడుకుంటున్నారు.
గతంలో శాసన మండలి చైర్మన్ గా పనిచేసిన స్వామిగౌడ్ రాజేంద్రనగర్ అసెంబ్లీ నుండి గత ఎన్నికల్లో టిక్కెట్ ఆశించి భంగపడ్డారు . ఇక ఎమ్మెల్సీగా మరోమారు అవకాశం ఇచ్చినప్పటికీ స్వామి గౌడ్ కు ఎలాంటి పదవి లేకపోవడంతో కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలోనే స్వామిగౌడ్ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి.