కిస్సా కుర్సీ కా...పల్లెల్లో వికసిస్తున్న గులాబీ..!
హైదరాబాద్ : ముందస్తు అసెంబ్లీ ఎన్నికల బంపర్ మెజార్టీతో జోష్ మీదున్న టీఆర్ఎస్.. పంచాయతీ ఎన్నికల్లో అదే పంథా కొనసాగిస్తోంది. తొలి విడత పంచాయతీ ఎలక్షన్లలో సత్తా చాటింది. టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు చాలాచోట్ల ఏకగ్రీవం కానున్నారు. 4,480 పంచాయతీలకు గాను 334 స్థానాల్లో సింగిల్ నామినేషన్లు దాఖలయ్యాయి.
అందులో 291 పంచాయితీలు టీఆర్ఎస్ ఖాతాలో పడ్డాయి. కాంగ్రెస్ బలపరిచినవారు 8 పంచాయతీల్లో, ఏ పార్టీ బలం లేనివారు 35 పంచాయతీల్లో, న్యూడెమోక్రసీ బలపరిచినవారు 3 పంచాయతీల్లో, బీజేపీ, సీపీఎం ఒక్కో స్థానాల్లో ఏకగ్రీవం కానున్నాయి. అయితే వీరి ఎన్నిక లాంఛనమే అయినా.. రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు ప్రకటించాల్సి ఉంది.
గులాబీ గుభాళింపు
తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో 4,480 పంచాయతీలకు గాను సర్పంచ్ పదవికి 27,940 దరఖాస్తులు వచ్చాయని గురువారం ప్రకటించారు ఎన్నికల అధికారులు. నామినేషన్లను పరిశీలించి అర్హులైన అభ్యర్థుల జాబితాను రిటర్నింగ్ అధికారులు విడుదల చేశారు. ఉపసంహరణ గడువు ఆదివారంతో ముగియనుంది. అయితే ఇప్పటివరకు 291 పంచాయతీలు ఏకగ్రీవంగా టీఆర్ఎస్ ఖాతాలో పడ్డాయి. నామినేషన్ల ఉపసంహరణ ముగిశాక.. మరిన్ని పంచాయతీలు ఏకగ్రీవం కానున్నాయి.
సంక్రాంతి పండుగకు సన్నద్ధం... ఏపీ, తెలంగాణకు స్పెషల్ బస్సులు
అదే జపం.. ఏకగ్రీవ మంత్రం
నామినేషన్ల ఉపసంహరణకు కొందరు పెద్దలు రంగంలోకి దిగారు. తాము బలపరిచిన అభ్యర్థులకు సపోర్టుగా ఇతరులు వేసిన నామినేషన్లు ఉపసంహరించుకునేలా పావులు కదుపుతున్నారు. గ్రామాభివృద్ది కమిటీల నేతలతో పాటు ఆయా రాజకీయ పార్టీల నేతలు పంచాయతీలు ఏకగ్రీవం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఒకవేళ బుజ్జగింపులు, బేరసారాలు వర్కవుటయితే.. పెద్దసంఖ్యలో పంచాయతీలు ఏకగ్రీవం కానున్నాయి.
అలా తొలి విడత.. ఇలా రెండో విడత
తొలివిడత పంచాయతీ ఎన్నికల తీరు అలా ఉంటే.. రెండో విడతకు రంగం సిద్ధమైంది. దీనికి సంబంధించి శుక్రవారం సన్నాహాలు షురూ కానున్నాయి. దీనికోసం ఈనెల 11 నుంచి 13 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 14న నామినేషన్లు పరిశీలించి బరిలో నిలిచే అర్హుల జాబితాను ప్రకటిస్తారు. ఉపసంహరణకు 17 వరకు అవకాశముంటుంది. 25వ తేదీన రెండో విడత పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారు అధికారులు.