లోకసభ, అసెంబ్లీలకు జమిలి ఎన్నికలు: బిజెపికి కేసీఆర్ మద్దతు
హైదరాబాద్: లోకసభకు, రాష్ట్రాల శాసనసభలకు జమిలి ఎన్నికల విషయంలో బిజెపికి తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) మద్దతు ప్రకటించింంది. జమిలి ఎన్నికల వల్ల వ్యయం తగ్గుతుందని, సమయం ఆదా అవుతుందని, ప్రభుత్వాలు అభివృద్దిపై దృష్టి పెట్టడానికి వీలవుతుందని లోకసభ టీఆర్ఎస్ పక్ష నేత ఎపి జితేందర్ రెడ్డి అన్నారు.
ప్రతిసారీ ఎన్నికలకు వెళ్లడానికి బదులు ఐదేళ్ల పాటు పరిపాలనపై దృష్టి కేంద్రీకరించడానికి సమయం చిక్కుతుందని ఆయన అన్నారు. జమిలి ఎన్నికలపై నిర్దిష్టమైన చర్చ జరగాల్సి ఉందని రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ జనవరి 29వ తేదీన చెప్పిన విషయం తెలిసిందే.
దేశంలోని ఏదో ఒక చోటు తరుచుగా ఎన్నికలు జరుగుతుండడం వల్ల ప్రజలు పరిపాలన తీరుపై ఇబ్బంది పడుతున్నారని కోవింద్ పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తూ కోవింద్ అన్నారు.
తరుచుగా ఏదో ఒక చోట ఎన్నికలు జరుగుతుండడం వల్ల ఆర్థిక వ్యవస్థపై, అభివృద్ధిపై ప్రతికూల ప్రభావం పడుతోందని ఆయన అన్నారు. జమిలి ఎన్నికలకు అనుకూలంగా ప్రధాని నరేంద్ర మోడీ కూడా మాట్లాడిన విషయం తెలిసిందే.