2014 నుంచి 'గ్రేటర్' దాకా షాక్: కెసిఆర్ అంచనాలకే అందలేదా?
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో అధికార తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభంజనం సృష్టించింది. ఈ అద్భుత ఫలితాలను తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు, మంత్రి కెటి రామారావు ఊహించారా? లేదా? అనే చర్చ సాగుతోంది. అందుకు వారి స్పందనే కారణమని గుర్తు చేస్తున్నారు.
గ్రేటర్ ఎన్నికల్లో తాము మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటామని, మెజార్టీ సీట్లు గెలుచుకుంటామని కెటిఆర్ చెప్పారు. తాము మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోకుంటే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సవాల్ చేశారు. కెటిఆర్ సవాల్ పైన టిడిపి నేత రేవంత్ రెడ్డి స్పందించారు.
కెటిఆర్ సవాల్ పైన పెద్దస్థాయిలో చర్చ సాగింది. గ్రేటర్లో వంద సీట్లు గెలవకుంటే తాను రాజీనామా చేస్తానని మంత్రి కెటిఆర్ చెప్పారని, దానికి ఆయన కట్టుబడి ఉంటారా అని టిడిపి, కాంగ్రెస్ నేతలు ప్రశ్నించారు. సీఎం కెసిఆర్ మీడియా సమావేశంలోను విలేకరులు ఈ విషయం ప్రస్తావించారు.
దానికి కెసిఆర్ స్పందిస్తూ... వంద సీట్లు గెలవకుంటే రాజీనామా చేస్తానని కెసిఆర్ ఎక్కడ చెప్పారని, మేయర్ పీఠం కైవసం చేసుకోకుంటే రాజీనామా చేస్తానని చెప్పారని వ్యాఖ్యానించారు. కెటిఆర్ కూడా తాను మేయర్ పీఠంపై సవాల్ చేశానని చెప్పారు.
అంతేకాదు, సీఎం కెసిఆర్ మాట్లాడుతూ.. తాము గెలుస్తామని, మెజార్టీ సీట్లు గెలుచుకోకున్నా తమకు మిత్రపక్షం మజ్లిస్ పార్టీ ఉందని చెప్పారు. తద్వారా గ్రేటర్లో ఇన్ని సీట్లు గెలుస్తామని కెసిఆర్, కెటీఆర్ కూడా ఊహించలేకపోయారని, వారు ఊహించని విధంగా సీట్లు సాధించారని అంటున్నారు.
సర్వేలు కూడా తెరాసకు 78-85 మధ్య సీట్లు వస్తాయని చెప్పాయి. అంటే ఎవరూ సర్వేలు, కెసిఆర్, తెరాస ఊహించని సీట్లు గెలుచుకుంది. 2014 ఎన్నికల్లో కూడా కెసిఆర్ ఊహించని అసెంబ్లీ సీట్లు కైవసం చేసుకున్నారి గుర్తు చేస్తున్నారు.
సార్వత్రిక ఎన్నికల సమయంలో కెసిఆర్ గజ్వెల్ అసెంబ్లీ నియోజకవర్గం, మెదక్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినందున, బిజెపి మద్దతిచ్చినందున.. ఈ పోటీలో తెరాస మేజిక్ ఫిగర్ 60 గెలుచుకోలేకపోవచ్చుననే అనుమానంతోనే ఎంపీగా పోటీ చేశారనే చర్చ సాగింది.
అయితే అప్పుడు కూడా తెరాస 63 స్థానాల్లో గెలుపొందింది. వరంగల్ ఉప ఎన్నికల్లోను గతంలో కంటే మెజార్టీ ఊహించినప్పటికీ.. మరీ దాదాపు నాలుగున్నర లక్షల మెజార్టీ తెరాస ఊహించలేదని అంటున్నారు. మొత్తానికి ప్రతి ఎన్నికల్లో కెసిఆర్ ఊహించిన దానికంటే ఎక్కువ మెజార్టీ ఇస్తున్నారని భావిస్తున్నారు.