కార్పోరేట్ గద్దల కోసమే వ్యవసాయ బిల్లు.. రైతులకు తీరని అన్యాయం.. రాజ్యసభలో వ్యతిరేకించాలన్న కేసీఆర్
దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అన్ని రంగాల్లో 'ఏకత్వ' సూత్రానికి ప్రాధాన్యతనిస్తూ వస్తోంది. ఏయే రంగాల్లో ఏకత్వం సాధ్యమవుతుందో వాటన్నింటిని ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలోనే ఒకే దేశం ఒకేసారి ఎన్నికలు, ఒకే దేశం ఒకే రేషన్ కార్డు,ఒకే దేశం ఒకే ట్యాక్స్,ఒకే దేశం ఒకే భాష వంటి నినాదాలను ఎత్తుకుంది. ఇందులో కొన్నింటిని అమలుచేయగా కొన్నింటికి అడ్డంకులను ఎదుర్కొంటోంది. తాజాగా కొత్త వ్యవసాయ బిల్లులతో 'వన్ నేషన్ వన్ మార్కెట్' అనే విధానాన్ని అమలులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. భిన్నత్వానికి ప్రతీక అయిన భారత్లో ఇలా అన్నింటిని ఏకత్వ గొడుగు కిందకు తీసుకురావడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజా వ్యవసాయ బిల్లులపై కూడా పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తోంది. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఈ బిల్లులను వ్యతిరేకించాలని నిర్ణయించారు.
రాజ్యసభలో గట్టిగా వ్యతిరేకించాలన్న కేసీఆర్...
కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లు తేనేపూసిన కత్తి వంటిది అని కేసీఆర్ అభివర్ణించారు. రైతు లోకానికి తీరని అన్యాయం చేసే ఈ బిల్లును కచ్చితంగా వ్యతిరేకించి తీరాలన్నారు. రాజ్యసభలో వ్యవసాయ బిల్లును ప్రవేశపెడుతున్న నేపథ్యంలో దాన్ని గట్టిగా వ్యతిరేకించాలని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ పక్ష నేత కేశవరావును ఆదేశించారు. రైతులకు మేలు చేసే బిల్లు అని పైకి చెబుతున్నప్పటికీ... ఇది పక్కా కార్పోరేట్లకు మేలు చేసేదే అన్నారు. రైతులు పంట ఉత్పత్తులను ఎక్కడైనా అమ్ముకోవచ్చునని బిల్లు చెబుతోందని... కానీ ప్రైవేట్,కార్పోరేట్ వ్యాపారులు ఎక్కడికైనా వెళ్లి కొనుగోలు చేసేందుకే దీన్ని తీసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కార్పోరేట్ గద్దల కోసమే...
కార్పోరేట్ గద్దలు దేశమంతా విస్తరించేందుకు,ప్రైవేట్ వ్యాపారులకు దారులు బార్లా తెరిచేందుకే ఈ బిల్లు ఉపయోగపడుతుందన్నారు. రైతులు తమ సరుకును ఎక్కడైనా అమ్ముకోవచ్చునని చెబుతున్న ప్రభుత్వం... వారి పరిస్థితులు,పరిమితుల గురించి ఏమైనా ఆలోచించిందా అని ప్రశ్నించారు. చిన్న,సన్నకారు రైతులు తాము పండించే కొద్దిపాటి పంటను ఎంత దూరమని రవాణా ఖర్చులు భరించి తీసుకెళ్లి అమ్ముకోగలరని ప్రశ్నించారు. రైతులకు తీవ్ర అన్యాయం చేసే ఈ చట్టాన్ని వ్యతిరేకించాల్సిందే అన్నారు.
మక్కల దిగుమతి... ఇదేం తీరు...
మక్కలపై దిగుమతిపై సుంకాన్ని తగ్గించి కోటి టన్నులను దిగుమతి చేసుకోవాలన్న కేంద్రం నిర్ణయాన్ని కేసీఆర్ తప్పు పట్టారు. ప్రస్తుతం మక్కల దిగుమతిపై 50శాతం సుంకం అమలులో ఉందని... దాన్ని 15శాతానికి తగ్గించి వేరే దేశాల నుంచి మక్కలు దిగుమతి చేసుకోవడమేంటని ప్రశ్నించారు. మన దేశంలోనే పుష్కలంగా మక్కలు పండుతున్నప్పుడు... సుంకం తగ్గించి మరీ విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడమేంటని నిలదీశారు. దేశం ఆర్థిక సంక్షోభంలో ఉన్న ప్రస్తుత తరుణంలో ఎవరి ప్రయోజనాల కోసం ఇదంతా చేస్తున్నారని మండిపడ్డారు.
Recommended Video
రాజ్యసభలో బిల్లులపై ఉత్కంఠ...
లోక్సభలో ఈ వ్యవసాయ బిల్లులను సులువుగానే గట్టెక్కించుకున్న బీజేపీకి రాజ్యసభలో ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందన్నది ఉత్కంఠగా మారింది. మొత్తం 245 సభ్యుల గల రాజ్యసభలో ప్రస్తుతం బీజేపీకి సొంతంగా 86 సభ్యుల మద్దతు ఉంది.విపక్ష కాంగ్రెస్కు 40 మంది సభ్యులు ఉన్నారు. మిగతా సభ్యులు ప్రాంతీయ పార్టీలకు చెందినవారు. అయితే మిత్రపక్షాలతో కలుపుకుని 130 మంది సభ్యుల మద్దతు లభిస్తుందని... అకాళీదళ్తో సంబంధం లేకుండా మిగతా పార్టీల మద్దతు కూడగట్టుకుంటామని బీజేపీ చెబుతోంది. రాజ్యసభలో జేడీయూ,అన్నాడీఎంకె,బిజూ జనతా దళ్ బీజేపీకి మద్దతునిచ్చే అవకాశం ఉంది. ఇక లోక్సభలో బిల్లులకు మద్దతునిచ్చిన వైసీపీ రాజ్యసభలోనూ మద్దతును ఇచ్చే అవకాశం ఉంది.