తెలుసుకో, రాజకీయం లేదు: జిగ్నేష్ మేవానీపై పిడమర్తి రవి ఆగ్రహం
హైదరాబాద్: గుజరాత్ ఇండిపెండెంట్ ఎమ్మెల్యే జిగ్నేశ్ మేవానీపై ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ పిడమర్తి రవి మండిపడ్డారు. తెలంగాణ గురించి కనీస అవగాహన లేదనీ, కాంగ్రెస్ నేతలు చెప్పిన మాటలు విని ప్రభుత్వంపై విమర్శలు చేశారన్నారు.
ఇటీవల మేవానీ కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పిడమర్తి రవి మాట్లాడారు. రాష్ట్రంలో సంపూర్ణ ప్రజాస్వామ్య ప్రభుత్వం నడుస్తోందని, ప్రభుత్వం అన్నివర్గాలకు అండగా ఉంటూ శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తోందన్నారు.
వాస్తవాలు తెలుసుకోకుండా జిగ్నేశ్ ఇక్కడికి వచ్చి పోలీసు రాజ్యం నడుస్తోందని చెప్పడాన్ని ఖండిస్తున్నామన్నారు. మందకృష్ణ అంబేడ్కర్ సిద్ధాంతాన్ని వదిలి దాడులకు పూనుకుంటుంటే, జిగ్నేశ్ వచ్చి మద్దతు తెలపడం దారుణమన్నారు.
మందకృష్ణ ఎస్సీ వర్గీకరణ గురించి కాకుండా, వ్యక్తిగత ఎజెండాతో పోతున్నారన్నారు. ఆయనతో వర్గీకరణ సాధ్యంకాదని దళితులందరికీ తెలిసిపోయిందనీ, అందుకే తామంతా వర్గీకరణ కోసం పోరాడుతున్నామన్నారు. జిగ్నేశ్ను ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కలవడంలో రాజకీయం లేదనీ, గురుకులాల సమాచారం కోరడంతో ఆయనకు ఇచ్చారన్నారు.