తెలంగాణలో అడుగు పెడతావా.. సారీ చెప్పు: చంద్రబాబుకు తుమ్మల డిమాండ్
హైదరాబాద్/ఖమ్మం: తెలంగాణలో ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరుకుంది. ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు బుధవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. వారు కొడంగల్, ఖమ్మం, హైదరాబాద్ల్లోని సభల్లో పాల్గొంటారు. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో అగ్రనేతలు అయిన నామా నాగేశ్వర రావు, తుమ్మల నాగేశ్వర రావుల మధ్య మాటల యుద్ధం సాగుతోంది.
ఖమ్మం ప్రజలకు క్షమాపణ చెప్పి చంద్రబాబు ఈ జిల్లాలో అడుగు పెట్టాలని తుమ్మల డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టు కోసం ఏడు మండలాలను గుంజుకోవడంపై ఆయన మండిపడ్డారు. దీనిపై నామా కూడా ధీటుగానే స్పందించారు. తుమ్మల తన మూలాలు తెలుసుకొని మాట్లాడాలన్నారు. చంద్రబాబుపై ఇష్టారీతిన మాటలు సరికాదన్నారు.
మనిషై పుడితే.. సిగ్గుండాలి, హరీష్! నీ బండారం బయటపెడ్తా, రబ్బర్ చెప్పులతో నడిపిస్తా: వంటేరు
చంద్రబాబు, రాహుల్ గాంధీలు కలిసి ప్రచారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తెలంగాణలో అడుగు పెట్టేముందు, ప్రచారం చేసే ముందు క్షమాపణ చెప్పి రావాలని ఇటీవల కేసీఆర్ కూడా డిమాండ్ చేశారు. రేపు కూటమి నేతలు వస్తున్నందున తుమ్మల మరోసారి డిమాండ్ చేశారు. అయితే తెలంగాణ ఏర్పాటు నాటికి రాష్ట్రం సర్ప్లస్లో ఉండటానికి, హైదరాబాద్ ప్రపంచపటంలోకి రావడానికి చంద్రబాబు కారణం అని, అలాంటి నేతను విమర్శించే నైతిక హక్కు లేదని టీడీపీ నేతలు అంటున్నారు.
చంద్రబాబు కూడా అదే చెబుతున్నారు. తెలంగాణకు తాను ఎప్పుడూ అన్యాయం చేయలేదని, ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన వారిలో అందరి కంటే తానే ముందు ఉంటానని ఏపీ ముఖ్యమంత్రి చెబుతున్నారు. తాను ఏనాడూ కేసీఆర్ ను తిట్టలేదని, ఆయన తనపై విమర్శలు ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. ఆయన మాటలు వింటుంటే బాధ కలుగుతోందన్నారు. మహానేత ఎన్టీఆర్ టీడీపీ పెట్టకపోతే కేసీఆర్ రాజకీయాల్లోకి వచ్చేవారా? అని ప్రశ్నించారు. తద్వారా తనకు తెలంగాణలో అడుగు పెట్టే హక్కు ఉందని చెబుతున్నారు.