సమాచార హక్కు చట్టంపై టీఆర్ఎస్ రెండు నాల్కల ధోరణి..! లోక్ సభలో అలా.. రాజ్య సభలో ఇలా..!!
న్యూఢిల్లీ/హైదరాబాద్ : సమాచార హక్కు చట్టంలో సమాల మార్పులకు కేంద్రం నడుం బిగిదచింది. అంతే కాకుండా హక్కు చట్టాన్ని పూర్తిగా తన గుప్పిట్లోకి తెచ్చుకునేందుకు ప్రణాళిక రచించింది. ఈ విధానం పట్ల టీఆర్ఎస్ పార్టీ ద్వంద్వ వైఖరి అవలంభిస్తోంది. రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకించగా లోక్ సభలో తటస్థంగా ఉండిపోయింది. దీంతో గులాబీ పార్టీ వైఖరిపై పలువురు రాజకీయ విశ్లేషకులు పెదవి విరుస్తున్నారు. సమాచార కమిషనర్ల వ్యవస్థను కేంద్రం తన చేతిలోకి తీసుకుంది. ఇకమీదట వారి పదవీకాలం, జీతభత్యాలు, వారి హోదా.. వీటన్నింటినీ కేంద్ర ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. ఈ మేరకు 2005 నాటి సమాచా ర హక్కు చట్టానికి తెచ్చిన సవరణలను లోక్సభ ఆమోదించింది. విపక్షాల నిరసన హోరు మధ్య ప్రభుత్వం తనకున్న మెజారిటీతో దీన్ని నెగ్గించుకుంది.
స.హ. కమిషనర్ల అధికారాలకు కత్తెర..! ఇక అంతా కేంద్ర సర్కార్ ఇష్టమే..!!
ఇది సమాచార హక్కు చట్ట స్ఫూర్తిని, స్వతంత్ర్యతను కాలరాస్తుందని, ఆ వ్యవస్థలోని పారదర్శకతను దెబ్బతీసి, కోరల్లేని కాగితపు పులిలా మారుస్తుందని కాంగ్రెస్, టీఆర్ఎస్, టీఎంసీ, డీఎంకే, బీజేడీ.. లాంటి పార్టీలన్నీ తీవ్రంగా వ్యతిరేకించాయి. తమ మాట వినడానికి అవకాశం ఇవ్వనందుకు నిరసనగా ఈ పార్టీల సభ్యులు వాకౌట్ చేశారు. కాగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దీన్ని సమర్ధించింది.ఆర్టీఐ చట్టంలోని సెక్షన్లు 13, 16లకు ప్రధాన సవరణలు చేశారు. సెక్షన్ 13 ప్రకారం.. కేంద్ర స్థాయిలో నియమించే ముఖ్య సమాచార కమిషనర్(సీఐసీ), సమాచార కమిషనర్లకు ఐదేళ్ల కాలపరిమితి లేదా 65 ఏళ్ల వయోపరిమితి (ఏది ముందయితే అది) ఉండేది.
ఆర్టీఐ సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం..! విపక్షాలు నిరసన... వాకౌట్..!!
అయితే తాజా సవరణ ప్రకా రం కేంద్రం నిర్దేశించిన గడువు మేరకే వారు ఆ పదవిలో ఉంటారు. పాత నిబంధనల ప్రకారం వారి జీతాలు, అలవెన్సులు, ఇతర సర్వీసు నిబంధనలు చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఎలక్షన్ కమిషనర్లతో సమానంగా ఉండేవి. తాజా సవరణ ప్రకారం 'ప్రభుత్వం నిర్దేశించిన మేరకు' ఈ జీతభత్యాలుంటాయి. ఇక సెక్షన్ 16 ప్రకారం రాష్ట్ర స్థాయి ముఖ్య సమాచార కమిషనర్ హోదా, జీతభత్యాలు, పదవీకాల పరిమితి అన్నీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ స్థాయితో సమానంగానూ, రాష్ట్ర స్థాయి కమిషనర్ల హోదా, జీతాలు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో సమానంగానూ ఉండేవి. దాన్నిపుడు తీసేశారు.
టీఆఎస్ ద్వంధ వైఖరి..! రాజ్యసభలో వ్యతిరేకత..లోక్ సభలో తటస్థం..!!
వీరి పదవీకాలం కూడా కేంద్ర ప్రభుత్వం నిర్దేశించే మేరకు ఉంటుంది. చివరకు బిల్లుపై ఓటింగ్ జరిగి 218-79 ఓట్ల తేడాతో వీగిపోయింది. కాగా, రాజ్యసభలో ఈ బిల్లు నిలిచిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలని విపక్ష ఎంపీలందరూ రాజ్యసభ ఛైర్మన్కు ఓ లేఖ రాశారు. ఈ బిల్లు సమాచార హక్కు చట్టం మౌలిక స్వభావాన్నే దెబ్బతీస్తుందని టీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు అభిప్రాయపడ్డారు. అయితే టీఆర్ఎస్ లోక్సభా పక్ష నేత నామా నాగేశ్వరరావు మాత్రం తాము లోక్సభలో బిల్లుపై తటస్థ వైఖరి అవలంబించినట్లు చెప్పడం విశేషం.
ఆర్టీఐ చట్టానికి దొంగదెబ్బ..! సవరణలు ఎందుకంటున్న మాజీ కమీషనర్ మాడభూషి..!!
సమాచార హక్కు చట్టాని(ఆర్టీఐ)కి సవరణ తీసుకురావడం 'తప్పుడు చర్య' అనీ, దీని ద్వారా ప్రభుత్వం కేంద్ర సమాచార కమిషన్ను దొంగ దెబ్బతీసేందుకు యత్నిస్తోందని మాజీ కమిషనర్ మాడభూషి శ్రీధర్ విమర్శించారు. ఈ సవరణ ఆర్టీఐని చావుదెబ్బతీస్తుందని, సమాచార కమిషన్ల స్వయం ప్రతిపత్తికి తూట్లు పొడుస్తుందని ఆయన అన్నారు. ఈ సవరణ బిల్లుని తిరస్కరించాలని కోరుతూ శ్రీధర్ ఎంపీలందరికీ లేఖలు రాశారు.