గ్రౌండ్ క్లియర్గా ఉంది... దుబ్బాకలో టీఆర్ఎస్ గెలుపు ఎప్పుడో డిసైడ్ అయింది : కేసీఆర్
దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్ఎస్ భారీ మెజార్టీతో విజయం సాధిస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. దుబ్బాకలో గ్రౌండ్ చాలా క్లియర్గా ఉందని... టీఆర్ఎస్ గెలుపు ఎప్పుడో డిసైడ్ అయిందని అన్నారు. ఎన్నికల వరకూ ప్రతిపక్షాలు ఇలాగే తతంగాలు చేస్తాయని విమర్శించారు. గురువారం(అక్టోబర్ 29) మీడియాతో చిట్చాట్ సందర్భంగా కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.
దుబ్బాక : మోదీ కన్నెర్ర చేస్తే జైల్లో ఉంటారు... కేసీఆర్,హరీశ్లకు బాబు మోహన్ హెచ్చరిక...
అంతకుముందు మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లిలో సీఎం కేసీఆర్ ధరణి వెబ్ పోర్టల్ సేవలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ర్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ధరణి పోర్టల్ భారతదేశానికే ట్రెండ్ సెట్టర్ అని వ్యాఖ్యానించారు. రైతుల భూములకు సంపూర్ణ రక్షణ ఉండాలన్న ఉద్దేశంతో ధరణి పోర్టల్ రూపకల్పన చేశామన్నారు.1 కోటి 45 లక్షల 58 వేల ఎకరాల భూముల వివరాలు ధరణి పోర్టల్లో ఉన్నాయని... విదేశాల్లో ఉన్నవాళ్లు కూడా ఈ పోర్టల్ ద్వారా తమ భూముల వివరాలను చూసుకోవచ్చునని తెలిపారు. ధరణి పోర్టల్తో ఇక అక్రమ రిజిస్ట్రేషన్లకు తావు ఉండదన్నారు.
మోసాలకు తావు లేకుండా... గందరగోళం లేకుండా... పక్కా పారదర్శకంగా ధరణి పోర్టల్ పనిచేస్తుందన్నారు. సులువుగా స్లాట్ బుకింగ్ చేసుకోవడం దగ్గరి నుంచి వెరిఫికేషన్,రిజిస్ట్రేషన్ వరకు అంతా ఆన్లైన్లోనే జరుగుతుందన్నారు. రెవెన్యూ చరిత్రలోనే ఇదో నూతన అధ్యాయం అన్నారు. భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం కావాలని... తెలంగాణ రైతాంగం ఎటువంటి ఆటుపోట్లకు గురికావద్దనే ఉద్దేశంతోనే కొత్త రెవెన్యూ చట్టం తీసుకొచ్చామన్నారు. మీసేవ,ధరణి పోర్టల్ లేదా వ్యక్తిగతంగా కార్యాలాయానికి వెళ్లి భూముల రిజిస్ట్రేషన్లు చేయించుకోవచ్చునని అన్నారు.
రైతు బంధు పథకం గురించి ప్రస్తావిస్తూ... కేసీఆర్ బతికున్నంత వరకు ఎవరు అడ్డొచ్చినా ఈ పథకం ఆగదన్నారు. రైతుల అప్పుల తీరి సొంత పెట్టుబడి వారి జేబుల్లోకి రావాలన్నదే తన కోరిక అన్నారు. కరోనా వచ్చి రాష్ట్ర ఆదాయం పడిపోయినా.. కేంద్రం నుంచి జీఎస్టీ నిధులు రాకపోయినా సంక్షేమ,అభివృద్ది పథకాలు ఆగలేదన్నారు. రైతు భీమా,రైతు బంధు పథకాలకు డబ్బులు పంపిణీ చేశామన్నారు. కరోనా కాలంలోనూ 48గంటల్లోనే 58 లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతు బంధు నిధులు జమచేశామన్నారు.