పరిషత్ ఎన్నికల్లో టీఆర్ఎస్ జోరు : మెజార్టీ స్థానాలు కైవసం, ప్రముఖ నేతల ఇలాకాలో విపక్షాల హవా
హైదరాబాద్ : స్థానిక సంస్థ ఎన్నికల్లో టీఆర్ఎస్ సత్తాచాటింది. మొత్తం 30 జిల్లాల్లో కారు హవా కొనసాగింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల్లో గులాబీ జెండా రెపరెపలాడింది. మొత్తం 30 జెడ్పీ స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. దీంతో 30 జెడ్పీ చైర్మన్లను టీఆర్ఎస్ సొంతం చేసుకున్నట్లైంది. మెజార్టీ ఎంపీటీసీలను కైవసం చేసుకోవడంతో .. ఎంపీపీ పదవులు కూడా కారు పార్టీకే దక్కే దక్కే అవకాశం ఉంది.
కారు జోరు ..
మొత్తం 534 జెడ్పీటీసీ, 5659 ఎంపీటీసీలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటివరకు వెల్లడైన ఫలితాల ప్రకారం టీఆర్ఎస్ పార్టీ 435 స్థానాల్లో విజయం సాధించింది. 30 జిల్లాలోని జెడ్పీస్థానాల్లో గులాబీ జెండా రెపరెపలాడనుంది. మెజార్టీ స్థానాలు టీఆర్ఎస్ పార్టీ సాధించింది. జగిత్యాలలో మొత్తం 17 జెడ్పీటీసీలు ఉండగా టీఆర్ఎస్ 16 కైవసం చేసుకుంది. మంచిర్యాలలో మొత్తం 26 స్థానాలు ఉండగా టీఆర్ఎస్ 12 చోట్ల విజయం సాధించింది. పెద్దపల్లిలో కూడా కారు జోరు కొనసాగింది. ఇక్కడ కమాన్ పూర్ నుంచి విజయం సాధించిన పుట్ట మధుకర్ జెడ్పీ చైర్మన్ అయ్యే అవకాశం ఉంది. రాజన్న సిరిసిల్లలో 11 చోట్ల టీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందారు. కామారెడ్డి. మెదక్, కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాద్, సిద్దిపేట, జనగామ సహా అన్ని జిల్లా జెడ్పీల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. ఆయా చోట్ల పరోక్ష పద్దతిలో జెడ్పీ చైర్మన్లను ఎన్నుకోనున్నారు. ఇక విపక్ష కాంగ్రెస్ పార్టీ 74 చోట్ల, బీజేపీ 07 చోట్ల, ఇతరులు 6 చోట్ల గెలుపొందినట్టు ఎన్నికల అధికారులు ప్రకటించారు.
ఎంపీటీసీలు కూడా ..
ఇటు ఎంపీటీసీ స్థానాల్లో కూడా టీఆర్ఎస్ తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. మొత్తం 5817 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగగా .. టీఆర్ఎష్ 3556 చోట్ల విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ 1377 చోట్ల గెలుపొందింది. బీజేపీ 211 చోట్ల .. ఇతరులు 593 ప్రాంతాల్లో విక్టరీ కొట్టారు. దీంతో మెజార్టీ ఎంపీపీ స్థానాలను కూడా టీఆర్ఎస్ కైవసం చేసుకోబోతోంది. ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ పరోక్ష ఎన్నిక ఈ నెల 7, 8వ తేదీన జరగనున్న సంగతి తెలిసిందే.
ప్రముఖల ఇలాకాలో ఓటమి
స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ హవా కొనసాగింది. కారు టాప్ స్పీడులో దూసుకెళ్లింది. కానీ టీఆర్ఎస్ ప్రముఖులు ప్రాతినిధ్యం వహిస్తోన్న చోట ఆ పార్టీ నేతలు ఓడిపోవడం కాస్త మింగుడపడని విషయం. కరీంనగర్ జిల్లా చినముల్కనూర్ ఎంపీటీసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థికి పరాజయం తప్పలేదు. ఇక్కడ ఇండిపెండెంట్ గా పోటీచేసిన రాజేశం విజయం సాధించారు. అధికార పార్టీ నుండి ఎన్నికల బరిలోకి దిగిన అభ్యర్థి ఓటమిపాలయ్యారు. సీఎం కేసీఆర్ దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తున్న గ్రామంలో టీఆర్ ఎస్ ఓటమిపాలు కావటం ఆ పార్టీకి మింగుడుపడని విషయం. నవీపేట మండలం పోతంగల్లో టీఆర్ఎస్ నుండి బరిలోకి దిగిన ఎంపీటీసీ అభ్యర్థి ఓటమి పాలయ్యారు. టీఆర్ఎస్ అభ్యర్థిపై బీజేపీ నుండి పోటీ చేసిన కత్రోజి రాజు 96 ఓట్ల తేడాతో గెలుపొందారు. నిజామాబాద్ లోక్సభ ఎన్నికల్లో ఓటమి పాలైన కవితకు స్వగ్రామంలో టీఆర్ఎస్ ఓటమి పాలవడం మింగుడపడని విషయం. మంత్రి కొప్పుల ఈశ్వర్ స్వగ్రామంలో టీఆర్ఎస్ అభ్యర్థి ఓడిపోయినట్టు తెలుస్తోంది.