5/5.. ఎమ్మెల్సీ స్థానాలపై గులాబీ కన్ను.. కారు ఖాతాలో 5 పడ్డట్లేనా?
హైదరాబాద్ : టార్గెట్ ఫిక్స్ చేసుకుంటే గురి తప్పదు. పని తలపెడితే చాలు అది జరిగి తీరాల్సిందే. ఇదంతా గులాబీ బాస్ కేసీఆర్ నైజం. ఎక్కడ వేగం పెంచితే గమ్యానికి సులువుగా చేరుకుంటారో కారు రథసారధికి బాగా తెలుసు. అందుకే గులాబీ ప్రస్థానం ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా సాగిపోతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో, పంచాయతీ పోరులో ఘన విజయం సాధించిన జోష్ తో.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలపై స్పెషల్ నజర్ పెట్టారు టీఆర్ఎస్ బాస్.
5/5.. గులాబీ మంత్రాంగం
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాగా వేస్తామంటూ ధీమాతో ఉంది టీఆర్ఎస్ హైకమాండ్. మొత్తం 5 స్థానాలకు గాను అన్నింటినీ సొంతం చేసుకుంటామనేది గులాబీ శ్రేణుల అంతరంగం. టీఆర్ఎస్ 4 స్థానాల్లో పోటీచేస్తూ.. ఒక స్థానాన్ని మజ్లిస్ పార్టీకి కేటాయించింది. అయితే కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిని బరిలోకి దించడంతో ఎన్నికలు అనివార్యమయ్యాయి.
గులాబీదే జోరు.. నేతల అంతరంగం
12వ తేదీ మంగళవారం ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో టీఆర్ఎస్ పెద్దలు రంగంలోకి దిగారు. అసెంబ్లీలో టీఆర్ఎస్ సంఖ్యా బలం 88. దానికి తోడు ఒక స్వతంత్ర ఎమ్మెల్యేతో పాటు ఫార్వార్డ్ బ్లాక్ నుంచి గెలిచిన మరో ఎమ్మెల్యే గులాబీ తీర్థం పుచ్చుకోవడంతో ఆ సంఖ్య 90కి చేరింది. ఇటీవల టీడీపీ ఎమ్మెల్యేతో పాటు కాంగ్రెస్ పార్టీ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు కారెక్కడంతో అసెంబ్లీలో గులాబీ బలం 94కి చేరింది. మరోవైపు ఏడుగురు మజ్లిస్ సభ్యుల బలం ఏలాగూ ఉంది. వీటన్నింటితో పాటు నామినేటేడ్ ఎమ్మెల్యే కూడా టీఆర్ఎస్ ఖాతాలోకే వస్తారు. మరో కాంగ్రెస్ మహిళా ఎమ్మెల్యే కూడా గులాబీతీర్థం పుచ్చుకునేందుకు మొగ్గు చూపుతున్నారట. అలా ఎమ్మెల్సీ ఎన్నికల లోపే బలం పెంచుకునే దిశగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చక్రం తిప్పారనే టాక్ నడుస్తోంది.
కాంగ్రెస్కు భారీ షాక్: తెరాసలోకి సబితా ఇంద్రారెడ్డి, కార్తీక్ రెడ్డి, మధ్యవర్తి అసదుద్దీన్!
గులాబీ "లెక్కల" రెక్కలు
119 శాసనసభ్యులతో పాటు నామినేటేడ్ ఎమ్మెల్యేను కలిపితే అసెంబ్లీలో సభ్యుల సంఖ్య 120. ఒకవేళ వీరందరూ హాజరైతే ఒక్కో ఎమ్మెల్సీకి ప్రథమ ప్రాధాన్యం కింద 21 ఓట్లు రావాలి. సభ్యులెవరైనా రాని పక్షంలో అది కాస్తా తగ్గుతుంది. అయితే టీఆర్ఎస్ బలం చూసినట్లయితే 88 (సొంత బలం) + 7 (మజ్లిస్ సభ్యులు) + 2 (స్వతంత్ర అభ్యర్థులు) + 1 (టీడీపీ) + 3 (కాంగ్రెస్) + 1 (నామినేటేడ్).. ఇలా మొత్తం 102 మంది సభ్యుల బలముంది. మరో ఇద్దరు కాంగ్రెస్ అభ్యర్థులు కూడా టీఆర్ఎస్ కు జై కొట్టనున్నట్లు సమాచారం. అలా టీఆర్ఎస్ బలం 104 కు చేరుతుంది. అయితే 21 ప్రథమ ప్రాధాన్యం ఓట్లతో 5 స్థానాలను ఈజీగా గెలుచుకోవాలంటే టీఆర్ఎస్ కు మొత్తం 105 (21X5) సభ్యులు కావాలి. ఈ లెక్కన ఇంకో సభ్యుడు అవసరమవుతారు. ఆ క్రమంలో మరో కాంగ్రెస్ సభ్యుని మద్దతు కోసం గులాబీ పెద్దలు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
మాక్ పోలింగ్.. పక్కా వ్యూహం
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల కోసం టీఆర్ఎస్ భారీ కసరత్తే చేస్తోంది. సోమవారం (11.03.2019) నాడు తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ శాసనసభ పక్ష సమావేశం నిర్వహించనుంది. టీఆర్ఎస్ లో చేరాలనుకుంటున్న ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కూడా ఈ సమావేశంలో భాగస్వాములను చేస్తున్నట్లు సమాచారం. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ఓటింగ్ పై నిపుణులు సలహాలు, సూచనలు ఇచ్చిన తర్వాత ఎమ్మెల్యేలతో సీఎం కేసీఆర్ మాట్లాడనున్నారు. అనంతరం నమూనా పోలింగ్ నిర్వహించే అవకాశముంది. మంగళవారం నాడు కూడా మరోసారి మాక్ పోలింగ్ నిర్వహించాకే సభకు వెళ్లనున్నారు టీఆర్ఎస్ సభ్యులు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో రహస్య ఓటింగ్ విధానం ఉండటంతో తమకు కలిసొచ్చే అంశంగా భావిస్తోంది టీఆర్ఎస్. ఆయా పార్టీలు విప్ జారీ చేసే అవకాశాలు తక్కువనే చెప్పాలి. ఇదే అంశాన్ని అనుకూలంగా మార్చుకోవడానికి టీఆర్ఎస్ పెద్దలు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్ సభ్యులు టీఆర్ఎస్ కు ఓటేసినా.. రహస్య ఓటింగ్ వల్ల బయటకు తెలిసే ఛాన్స్ లేకపోవడం వల్ల ఎలాంటి సమస్యలు ఉండబోవనేది గులాబీశ్రేణుల అంతరంగం. అందుకే 5/5 క్లీన్ స్వీప్ పై ధీమాతో ఉన్నారు.