ఒంటరిగా పోటీ 100 సీట్లలో గెలుస్తాం, సెప్టెంబర్లో అభ్యర్థులు, ముందస్తు లేదు: కేసీఆర్
హైదరాబాద్: టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ముగిసిన అనంతరం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నామన్నారు. సమావేశంలో 9 తీర్మానాలు చేసినట్లు తెలిపారు. విభజన హామీలను నెరవేర్చాలని ఏకగ్రీవ తీర్మానం చేశామన్నారు. విభజన ప్రక్రియను సంపూర్ణం చేయాలన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.25వేల కోట్ల ప్యాకేజీ ప్రకటించాలని మరో తీర్మానం చేసినట్లు తెలిపారు. నరేగాను వ్యవసాయానికి అనుసంధానం చేయాలన్నారు. మైనార్టీలకు రిజర్వేషన్లు కల్పించి 9వ షెడ్యూలులో చేర్చాలన్నారు. వరిధాన్యం, మక్కలకు కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ.2వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తీర్మానం చేసినట్లు తెలిపారు.
బీసీలకు, మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లపై తీర్మానం చేశామని చెప్పారు. విభజన తర్వాత తెలంగాణలో ముస్లీంలు, దళితుల సంఖ్య తగ్గిందన్నారు. రిజర్వేషన్లపై తమిళనాడుకు ఓ రూలు, మాకు ఓ రూలు సరికాదన్నారు. మైనార్టీలకు రిజర్వేషన్లు కల్పించి 9వ షెడ్యూల్లో చేర్చాలన్నారు. ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ చట్టంపై కాలయాపన చేయవద్దని తీర్మానం చేసినట్లు తెలిపారు.
నీతి ఆయోగ్ అంటే నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అని కేసీఆర్ తెలిపారు. నీతి అయోగ్ తీరు పేరు గొప్ప, ఊరు దిబ్బలా ఉందన్నారు. దీని వల్ల ఒరిగిందేమీ లేదన్నారు.
తెలంగాణ భవన్లో ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ప్రారంభమైన టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం.#TRS #Telangana pic.twitter.com/iiGUobEHsK
— TRS Party (@trspartyonline) August 13, 2018
న్యూస్ పేపర్లు కొన్ని రకాల ప్రచారాలను మానుకోవాలని కేసీఆర్ సూచించారు. నేను 40 మంది ప్రజాప్రతినిధులను మారుస్తానని చెప్పారని, కానీ అది సరికాదన్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ఒంటరిగానే పోటీ చేస్తుందని, ఇందుకు పార్టీ కార్యవర్గం ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుందని చెప్పారు.
హైదరాబాదులోని ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో సెప్టెంబర్ 2వ తేదీన భారీ ప్రగతి నివేదన సభను నిర్వహించనున్నట్లు తెలిపారు. అభ్యర్థులను సెప్టెంబర్ నెలలోనే ప్రకటిస్తామని తెలిపారు.
వచ్చే ఎన్నికల్లో తెరాస 100కు పైగా స్థానాల్లో గెలుస్తుందని కేసీఆర్ చెప్పారు. ఇందులో ఎలాంటి అనుమానం లేదన్నారు. ఆరేడు సర్వేలు చేయించామన్నారు. నాన్ కాంగ్రెస్, నాన్ బీజేపీ ఫెడరల్ ఫ్రంట్ కోసం నేను ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని చెప్పారు. కర్ణాటకలో కాంగ్రెస్ మద్దతిచ్చిన ప్రభుత్వం అధికారంలో ఉందని చెప్పారు. ముందస్తు గురించి చర్చ ఉండదని చెప్పారు. ఆరు నెలలకు ముందు ఎన్నికలు వచ్చినా ముందస్తు అనలేమన్నారు. ముందస్తు లేదు వెనుకస్తు లేదన్నారు.
Live from Telangana Bhavan https://t.co/AgNyBHixGv
— TRS Party (@trspartyonline) August 13, 2018