ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జోక్యం చేసుకుంటాం: కేటీఆర్
Recommended Video
డిసెంబర్ 7న జరిగిన ఎన్నికలను తెలంగాణ కాంగ్రెస్ ఛీఫ్ నిశబ్ద విప్లవంగా అభివర్ణించారని వాస్తవానికి జరిగింది శబ్ద విప్లవమే అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణలో గులాబీ పార్టీ విజయ ఢంకా మోగించిన తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో తొలిసారిగా సోమాజీగూడలో ఏర్పాటు చేసిన మీట్ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు కేటీఆర్. ఇంతటి ఘనవిజయం అందించిన తెలంగాణ ప్రజలకు కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.
వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్, హరీష్ రావు అభినందనలు (ఫోటోలు)
కాంగ్రెస్కు టీఆర్ఎస్కు ఓటింగ్లో భారీ తేడా ఉంది
ఈ సారి ఓటింగ్లో 2కోట్ల మంది పాల్గొన్నారని అందులో 98లక్షల ఓట్లు గులాబీ పార్టీకే వచ్చాయని గుర్తుచేశారు కేటీఆర్. నాలుగు పార్టీల కలయికతో పోటీచేసిన ప్రజాకూటమికి 48 లక్షల ఓట్లు వచ్చాయని చెప్పారు. ఈ అంతరం చూస్తే ప్రజలు ఎవరివైపు ఉన్నారో అర్థమవుతుందని కేటీఆర్ అన్నారు. తెలంగాణ ప్రజలకు టీఆర్ఎస్ పార్టీ ఒక రక్షణ కవచంలా నిలిచిందన్నారు. ఇక ఎన్నికలకు ముందే తాను చెప్పినట్లుగా బీజేపీకి 103 స్థానాల్లో డిపాజిట్ గల్లంతు అయ్యిందని చెప్పారు. టీఆర్ఎస్ పార్టీ ఇంకా బలపడాల్సి ఉందని అభిప్రాయపడ్డ కేటీఆర్ రానున్న రోజుల్లో బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ బలోపేతం పై దృష్టి సారిస్తామని చెప్పారు. ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను తు.చ తప్పకుండా పాటిస్తామని చెప్పారు కేటీఆర్.
రెండోసారి తెలంగాణ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్ (ఫోటోలు)
కేంద్రంలో కాంగ్రెస్, బీజేపీలు సొంతంగా అధికారంలోకి రాలేవు
కేంద్ర రాజకీయాల్లో కూడా సమూలమైన మార్పు రావాలని ఆకాంక్షించిన కేటీఆర్ త్వరలోనే ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు కేసీఆర్ కృషి చేస్తారని చెప్పారు. కేంద్రంలో బీజేపీ కాంగ్రెస్యేతర ప్రభుత్వాలు వస్తేనే దేశంబాగుపడుతుందని చెప్పారు. తెలంగాణతో పాటు జరిగిన ఇతర రాష్ట్రాల ఎన్నికలను పరిశీలిస్తే... ఛత్తీస్గడ్లో కాంగ్రెస్కు స్పష్టమైన మెజార్టీ రాగా ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఇతరుల సహాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోందని గుర్తు చేశారు కేటీఆర్. అంటే ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ, బీజేపీని కానీ కోరుకోవడంలేదని అన్నారు. ఇందుకోసమే కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ కీలకం కావాలని ఆయన అన్నారు. ఇందుకోసం తెలంగాణ ప్రజలు 2019లో టీఆర్ఎస్ పార్టీకి 16 లోక్సభ స్థానాలు అందివ్వాలని కోరారు.
ఒక్క ఓటుతో ప్రభుత్వం పడిపోవచ్చు... అదే ఒక్క ఓటుతో గట్టెక్కొచ్చు
ఇప్పటికే 14 సీట్లతో లోక్సభలో ఉన్న టీఆర్ఎస్ మరో రెండు సీట్లు గెలుచుకోవడం ద్వారా ఎలాంటి పాత్ర పోషిస్తుందన్న విలేఖరి ప్రశ్నకు కేటీఆర్ స్పందించారు. నాడు ఒక్క ఓటుతో పార్లమెంటులో వాజ్పేయి ప్రభుత్వం ఓడిపోయిందని గుర్తు చేశారు. 16 సీట్లకు కొన్నిసార్లు విలువ ఉండదని... కొన్ని సార్లు ఒక్క సీటుకు కూడా ఎంతో విలువ ఉంటుందని చెప్పిన కేటీఆర్ అది ప్రజాస్వామ్యం గొప్పతనమని వెల్లడించారు. ఇక 2019 పార్లమెంటు ఎన్నికల్లో ఇటు బీజేపీ కానీ, అటు కాంగ్రెస్ కానీ సొంతంగా అధికారంలోకి వచ్చే పరిస్థితి కనిపించడం లేదని జోస్యం చెప్పారు కేటీఆర్. ఆ సమయంలో కేంద్రంలో కాంగ్రెస్ బీజేపీ యేతర పార్టీలు కాకుండా ఫెడరల్ ఫ్రంట్ కీలకంగా వ్యవహరిస్తుందని చెప్పారు.
2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత నామమాత్రంగానే మిగిలిపోనున్న టీడీపీ
2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత టీడీపీ కేవలం నామమాత్రం పార్టీగా మిగిలిపోతుందని కేటీఆర్ తెలిపారు. బీజేపీని బూచిగా చూపించి తన అసమర్ధతను ఏపీ సీఎం చంద్రబాబు బయటపెట్టకుంటున్నారని అన్నారు. కేసీఆర్ దేశరాజకీయాల్లో గుణాత్మకమైన మార్పు కోసం పనిచేస్తుంటే... చంద్రబాబు మాత్రం దేశం కోసం కాకుండా తెలుగుదేశం కోసం పనిచేస్తున్నారని విమర్శించారు. ఇప్పుడు ఏపీలో ఉన్న పరిస్థితులు చూస్తే చంద్రబాబుకు అనుకూలంగా లేవని చెప్పారు కేటీఆర్. దేశ రాజకీయాల్లో టీఆర్ఎస్ అడుగుపెట్టబోతోంది కనుక ఏపీ కూడా దేశంలో అంతర్భాగం కనుక అక్కడ కూడా తమ జోక్యం కచ్చితంగా ఉంటుందని చెప్పారు. ఇక ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబుకే క్లారిటీ లేదని ఎద్దేవా చేశారు కేటీఆర్.