40 మంది టీఆర్ఎస్ నేతలను అడ్డుకున్నారు: పొన్నం, టీఆర్ఎస్కు టీడీపీ సూచనలు
కరీంనగర్: తమకు వందకు పైగా స్థానాలు వస్తాయని తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు కేటీ రామారావు తదితరులు చెప్పడంపై కరీంనగర్ మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ ఆదివారం మండిపడ్డారు. వందకు పైగా సీట్లు వస్తాయని తెరాస నేతలు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.
చంద్రబాబు-రాహుల్లకు 'ఎగ్జిట్' షాక్: కేసీఆర్దే గెలుపు, ఏ సర్వే ఏం చెప్పిందంటే? 90 సీట్లన్న ఓ సర్వే
అదే మేనిఫెస్టో కొద్ది మార్పులతో
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పట్ల సానుకూల వాతావరణం నెలకొని ఉందని చెప్పారు. సెప్టెంబర్లో అసెంబ్లీని రద్దు చేసిన కేసీఆర్ ఇప్పటి వరకు సహేతుకమైన కారణం చెప్పలేకపోయారన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోను తొలుత టీఆర్ఎస్ నేతలు తప్పుబట్టారన్నారు. కానీ ఆ మేనిఫెస్టో ప్రజల్లోకి వెళ్లడం చూసి కొద్దిపాటి మార్పులతో వారూ అదే మేనిఫెస్టోను విడుదల చేశారని ఎద్దేవా చేశారు.
అందుకే దాదాపు 40 మందిని అడ్డుకున్నారు
కేసీఆర్ గత ఎన్నికలలో ఇచ్చిన హామీల్ని నెరవేర్చలేకపోయారని పొన్నం అన్నారు. అందుకే ఎన్నికల ప్రచారంలో 30 నుంచి 40 మంది ఆ పార్టీ అభ్యర్థులను ప్రజలు అడ్డుకున్నారని చెప్పారు. ఇప్పటికీ కేటీఆర్ 100 సీట్లు వస్తాయని చెప్పడం చూస్తుంటే విడ్డూరంగా ఉందని చెప్పారు. వాస్తవంగా ఆ పార్టీకి 100 కాదు 10 స్థానాలు కూడా వచ్చే పరిస్థితి లేదన్నారు.
మీ పొత్తు మాటేమిటి
అన్ని పార్టీల జెండాలను భుజాలపై మోస్తున్నారని మహాకూటమి నేతలను టీఆర్ఎస్ నేతలు విమర్శించారని, మరి ఆ పార్టీ నేతలు మరి మజ్లిస్ పార్టీతో లోలోన పొత్తు పెట్టుకున్న మాట ఏమిటని ప్రశ్నించారు. అలాగే, బీజేపీతోను అంతర్గత ఒప్పందం ఉందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.
కేసీఆర్, కేటీఆర్లకు టీడీపీ సూచన
తెరాస గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మోసం చేసినందువల్లే ఆ పార్టీకి వ్యతిరేకంగా ప్రజలు భారీగా పోలింగ్లో పాల్గొన్నారని టీడీపీ నేత రావుల చంద్రశేఖర రెడ్డి అన్నారు. ఫలితాల తరవాత రాజకీయ సన్యాసం వంటి నిర్ణయాలు తీసుకోకుండా టీఆర్ఎస్ నేతలు ప్రజల్లోనే ఉండాలని సూచించారు. ఢిల్లీలో బీజేపీయేతర పార్టీలతో చంద్రబాబు సమావేశం ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. అది విజయవంతమై మంచి ఫలితాలు వస్తాయన్నారు. కమలం వాడిపోతోందని, ఎన్నికల్లో ప్రతిపక్షాలు వికసిస్తున్నాయన్నారు. చంద్రబాబుపై టీఆర్ఎస్ నేతల దుర్భాషను ప్రజలు తిప్పికొట్టారన్నారు. బీజేపీకి చెందిన 16 మంది కేంద్రమంత్రులు తెలంగాణలో ప్రచారం చేసినా, టీఆర్ఎస్ నేతలు వారినేమీ అనలేదన్నారు. కేసీఆర్ కూడా గెలవలేక ఇబ్బందుల్లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయన్నారు.