తెలంగాణలో కేసీఆర్ గ్రాఫ్ పెరిగిందంటున్న సర్వే..ఎవరు చేశారు..? ఏమా కథ
తెలంగాణలో ఎన్నికలకు ఇంకా ఒక నెల సమయం మాత్రమే ఉంది. దీంతో పలు సంస్థలు చేపట్టిన సర్వేలు రాజకీయపార్టీల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. కొన్ని సర్వేలు టీఆర్ఎస్కే ప్రజలు పట్టం కడుతారని చెబుతుండగా... మరికొన్ని సర్వేలు ప్రజలు కూటమి వైపే మొగ్గు చూపుతున్నారంటూ జోస్యం చెబుతున్నాయి. ఇలా తెలంగాణపై సర్వేలు భిన్నాభిప్రాయం వ్యక్తం చేస్తుండటంతో నేతలు కన్ఫ్యూజన్కు గురువుతున్నారు. తాజాగా ప్రముఖ జాతీయ న్యూస్ ఛానెల్ ఇండియా టుడే చేపట్టిన సర్వేలో కారు దూసుకెళుతోందంటూ వెల్లడించింది.
జోరు మీదున్న కారు
డిసెంబర్ 7న తెలంగాణ అసెంబ్లీకి జరగనున్న ఎన్నికల్లో గులాబీ పార్టీ సత్తా చాటుతుందని ప్రముఖ జాతీయ మీడియా ఇండియాటుడే ఆధ్వర్యంలో పొలిటికల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (పీఎస్ఈ) సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది. పీఎస్ఈ చేపట్టిన సర్వేలో 75శాతం మంది ప్రజలు గులాబీ బాస్ కేసీఆర్కే జై కొట్టినట్లు వెల్లడించింది. ఇది ఇప్పటికిప్పుడు చేసిన సర్వే కాదని ప్రతి వారం ట్రెండ్ను పర్యవేక్షించి, విశ్లేషించి విడుదల చేసిన సర్వే ఫలితాలని పీఎస్ఈ పేర్కొంది.
కేసీఆర్కు శ్రీరామ రక్షగా నిలిచిన సంక్షేమ పథకాలు
తెలంగాణలో మొత్తం 17 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో పీఎస్ఈ సంస్థ సర్వే నిర్వహించింది. అయితే ఇది టెలిఫోన్ ఇంటర్వ్యూ ద్వారా సర్వే చేసింది. మొత్తం 6,877 శాంపిల్స్ తీసుకున్నట్లు వెల్లడించింది. అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని కేసీఆర్ తీసుకున్న నిర్ణయం సరైనదేనని ఇప్పటికైనా తెలుసుకోవాలని చెబుతున్నారు గులాబీ నేతలు. ఇక కేసీఆర్ అన్ని సామాజిక వర్గాల వారికి ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలే ఆయన్ను మరోసారి ముఖ్యమంత్రి చేస్తాయని సర్వే తెలిపింది. ముఖ్యంగా కేసీఆర్ ప్రవేశపెట్టిన జీవితబీమా, రైతు బంధు పథకాలు సూపర్ హిట్ అవడమే కాకుండా ఓటర్ల మనసులో కేసీఆర్ నిలిచిపోయారని సర్వే వెల్లడించింది.
విపక్షాల మైండ్ గేమ్కు సర్వే ఫలితాలే సమాధానం: టీఆర్ఎస్
ఇక కొన్ని వారాల నుంచి ఈ సర్వేను పీఎస్ఈ పర్యవేక్షిస్తోంది. అయితే కేసీఆర్కు ప్రజాదరణ ఏదశలోనూ తగ్గలేదని సర్వే తెలిపింది. మరోవైపు ప్రజాకూటమి ఎక్కడా సత్తాచాటలేకపోయిందని సర్వే పేర్కొంది. ఇక హైదరాబాద్లో మజ్లిస్ పార్టీ కాంగ్రెస్కు అడ్డుకట్ట వేయనున్నట్లు సర్వేలో తేలింది. ఇదిలా ఉంటే ఈ సర్వే టీఆర్ఎస్ క్యాడర్లో జోష్ నింపిందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఆపద్ధర్మ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్లోకి వస్తారంటూ కొందరు కాంగ్రెస్ నేతలు మైండ్ గేమ్ ఆడుతున్నారని అలాంటి వారికి ఈ సర్వే చెంపపెట్టులాంటిదని టీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి.