రూ.10 కోట్లపై నాయిని చెప్పారు, కొడంగల్లో రూ.100 కోట్లు: కేసీఆర్పై రేవంత్ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తన సహచర మంత్రులను, కార్యకర్తలను బానిసలుగా చూస్తున్నారని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, కొడంగల్ తాజా మాజీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి శుక్రవారం నాడు ధ్వజమెత్తారు.
తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి చేసిన ప్రకటనను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ సుమోటోగా స్వీకరించి, ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ పైన కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేయాలని కోరారు.
నాయిని వ్యాఖ్యలు సుమోటోగా తీసుకోవాలి
ప్రగతి భవన్ అప్రకటిత కర్ఫ్యూ ప్రాంతంగా మారిందని రేవంత్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్ నాయిని నర్సింహా రెడ్డికే అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని ఆరోపించారు. తనకు ముషీరాబాద్ టిక్కెట్ ఇవ్వకుండా, నియోజకవర్గం మారితే తనకు పది కోట్ల రూపాయలు ఇస్తానని కేసీఆర్ చెప్పారని నాయిని వ్యాఖ్యానించారని తెలిపారు. నాయిని వ్యాఖ్యలను సుమోటోగా తీసుకోవాలన్నారు.
రూ.10 కోట్లు ఇస్తానని కేసీఆర్ చెప్పారని నాయిని చెప్పారు
తాను ఎల్బీ నగర్లో పోటీ చేస్తే రూ.10 కోట్లు ఇస్తానని కేసీఆర్ ప్రకటించారని నాయిని స్వయంగా చెప్పారని రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్కు, తెరాసకు మొదటి నుంచి వెన్నంటి ఉన్న నాయిని నర్సింహా రెడ్డికి కేసీఆర్ అపాయింటుమెంట్ ఇవ్వడం లేదని, అంటే ఇది అవమానించడం కాదా అని నిప్పులు చెరిగారు.
నియోజకవర్గానికి రూ.10 కోట్లు ఖర్చు
నాయిని నర్సింహా రెడ్డికి టిక్కెట్ ఇవ్వకపోవడం విషయం పక్కన పెడితే, కనీసం ఆయనకు అపాయింటుమెంట్ కూడా ఇవ్వడం లేదని, దీంతోనే టీఆర్ఎస్ పార్టీలో పరిస్థితిని అర్థం చేసుకోవచ్చునని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఉద్యమకారుడిని అని చెప్పుకునే కేసీఆర్ ప్రతి నియోజకవర్గానికి రూ.10 కోట్లు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉందని చెప్పారు.
రూ.28 లక్షలకు బదులు రూ.10 కోట్లు
అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కో అభ్యర్థి ఖర్చు పరిమితి రూ.28 లక్షలు కాగా కేసీఆర్ రూ.10 కోట్లు ఇస్తానని చెప్పినట్లు నాయిని చేసిన ప్రకటనను ఈసీ పరిగణలోకి తీసుకోవాలని రేవంత్ అన్నారు. తనకు లేదా తన అల్లుడికి ముషీరాబాద్ టిక్కెట్ ఇవ్వాలని సీఎంను నాయిని కోరగా ఎల్బీ నగర్ నుంచి పోటీ చేయాలని సూచించిన సీఎం.. అక్కడ అభ్యర్థిని ఎదుర్కొనేందుకు రూ.10 కోట్లు ఇస్తానని కేసీఆర్ చెప్పారని నాయిని ప్రస్తావించారన్నారు.
కొడంగల్లో రూ.100 కోట్లు
అధికార పార్టీ డబ్బుతో గెలవాలనుకుంటోందని, తాము చేసిన ఆరోపణలు అక్షరాలా నిజమయ్యాయని చెప్పారు. అన్ని నియోజకవర్గాల్లో రూ.10 కోట్లు ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉన్న కేసీఆర్, తన నియోజకవర్గం కొడంగల్లో మాత్రం రూ.100 కోట్లు ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉందని ఆరోపించారు. రూ.25వేల కోట్ల మేర అక్రమ సంపాదన ఉందని తాము చేస్తున్న ఆరోపణలు నిజమన్నారు.
ఐటీ సోదాలపై రేవంత్ రెడ్డి
ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలోని ఆదాయపన్ను శాఖ సోదాలు, ఈడీ దాడులపై రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ దాడులు ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కనుసన్నుల్లోనే జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రతిపక్ష నేతలపై కాకుండా ముఖ్యమంత్రి ఉంటున్న ప్రగతి భవన్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, ఎంపీ కవిత ఇళ్లపై ఐటీ సోదాలు చేయాలని డిమాండ్ చేశారు.