బీజేపీకి మంత్రి కేటీఆర్ వార్నింగ్... ముఖ్యమంత్రులనే ఉరికించిన చరిత్ర మాది...
చిన్న చిన్న విజయాలకే ఎగిరెగిరి పడుతున్న బీజేపీ నేతలకు తగిన సమయంలో బుద్ధి చెప్తామని తెలంగాణ ఐటీ,పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. తమ సహనాన్ని అసమర్థతగా భావిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. తెలంగాణ కాంగ్రెస్, తెలంగాణ బీజేపీ ఏర్పడ్డాయంటే అది కేసీఆర్ భిక్ష అన్నారు. శుక్రవారం(ఫిబ్రవరి 12) రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటన సందర్భంగా పద్మనాయక కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన పార్టీ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు.
సీఎం కేసీఆర్పై ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని... నాటి ముఖ్యమంత్రులను ఉరికించిన చరిత్ర టీఆర్ఎస్ పార్టీకి ఉందన్న విషయాన్ని బీజేపీ నేతలు మరిచిపోవద్దని అన్నారు. ప్రధానమంత్రి, కేంద్రమంత్రులను కూడా వదిలిపెట్టమని హెచ్చరించారు. మాటలు మాట్లాడే పరిస్థితే వస్తే.. మీ కంటే ఎక్కువగా మాట్లాడగలమని బీజేపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. గడిచిన 20 ఏండ్లలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని నిలబడి ఈ స్థాయికి వచ్చామని కేటీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని సాధించి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కేసీఆర్ నిలబెట్టారని పేర్కొన్నారు.
దేశంలో వందశాతం సాగు, తాగునీరు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కేంద్రమే చెప్పిందన్నారు. కేసీఆర్ పరిపాలనాదక్షుడని కేంద్రమంత్రులే కొనియాడారని గుర్తుచేశారు. కాంగ్రెస్ హయాంలో రైతులకు 9 గంటల కరెంట్ ఇస్తామని చెప్పి.. ఏ ఒక్క రోజు కూడా 6 గంటల కరెంట్ ఇవ్వలేదన్నారు. అర్ధరాత్రి కరెంట్ ఇచ్చి రైతుల ప్రాణాలతో చెలగాటమాడారని మండిపడ్డారు.
ప్రస్తుత టీఆర్ఎస్ ప్రభుత్వం రైతన్నలకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తోందని తెలిపారు. దేశంలో 24 గంటల కరెంట్ ఇస్తున్న రాష్ర్టం తెలంగాణ మాత్రమే అని స్పష్టం చేశారు. రైతుబంధు, రైతు భీమా, రుణమాఫీలతో రైతులను ఆదుకుంటున్న ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే అని తెలిపారు.గ్రామాల్లో టీఆర్ఎస్ నేతలు అందరినీ కలుపుకుని పోవాలన్నారు. టీఆర్ఎస్ పార్టీ అందరి పార్టీ అని... పార్టీ సభ్యత్వ నమోదు విషయంలో సిరిసిల్ల అగ్రభాగంలో ఉండాలని స్థానిక నేతలు,కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
ఇటీవల హాలియా బహిరంగ సభలోనూ కాంగ్రెస్,బీజేపీలను ఉద్దేశించి ముఖ్యమంత్రి కేసీఆర్ గట్టి హెచ్చరిక చేసిన సంగతి తెలిసిందే. 'సహనానికి కూడా ఓ హద్దు ఉంటుంది..పిచ్చి వాగుడుకు హద్దు ఉంటుంది..హద్దు మీరిన నాడు..ఏం చేయాలో మాకు కూడా తెలుసు. చాలా మంది రాకాసులతో కొట్లాడినం.. తొక్కిపడేస్తాం..జాగ్రత్త.. పిచ్చి పనులు బంద్ చేసుకోవాలె. లేకుంటే..దారుణంగా నష్టపోతరు.' అని కేసీఆర్ హాలియా సభలో హెచ్చరికలు జారీ చేశారు.