ఎన్నికలొస్తే టీఆర్ఎస్కు 111 సీట్లు ఖాయం: సర్వే, సెల్ఫోన్లపై కేసీఆర్ వేటు
తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్)కు 111 సీట్లు రావడం ఖాయమని ముఖ్యమంత్రి, ఆ పార్టీ అధినేత కే చంద్రశేఖర్ రావు వెల్లడించారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్)కు 111 సీట్లు రావడం ఖాయమని ముఖ్యమంత్రి, ఆ పార్టీ అధినేత కే చంద్రశేఖర్ రావు వెల్లడించారు. శనివారం టీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో ఆయన సర్వే వివరాలను బయటపెట్టారు. ఇక ఎంఐఎంకు ఆరు సీట్లు వస్తాయని సర్వేలో వెల్లడైంది. త్వరలో జరగబోయే రాష్ట్రపతి ఎన్నికల్లో తమ పార్టీ తటస్థంగా ఉండాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
సెల్ ఫోన్లకు అనుమతి లేదు
తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ, శాసనసభాపక్ష సమావేశం ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన శనివారం సాయంత్రం ప్రారంభమైంది. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో పార్టీ పటిష్ఠతే లక్ష్యంగా సీఎం అత్యవసరంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది.
అయితే, ఈ సమావేశంలోకి పార్టీ నేతలెవరూ సెల్ఫోన్లు తీసుకురావద్దని సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు సమాచారం. ముఖ్యమంత్రి తీసుకున్న ఈ కొత్త నిర్ణయంతో పార్టీ నేతల్లో ఉత్కంఠ నెలకొంది. సమావేశంలో ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారోనని పార్టీ శ్రేణుల్లో ఆసక్తి నెలకొంది.
ఇటీవలే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలంగాణలో పర్యటించి రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేయడం, త్వరలో రాష్ట్రపతి ఎన్నిక ఉండటం, సంగారెడ్డిలో రాహుల్గాంధీ ప్రజాగర్జన సభ తదితర అంశాలు సమావేశంలో చర్చించే అవకాశముంది.