దత్తాత్రేయను అవమానించారు, సికింద్రాబాద్లో బీజేపీని ఘోరంగా ఓడిస్తాం: కేటీఆర్
హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల్లో ఈసారి సికింద్రాబాద్ లోకసభ స్థానంలో తెరాస జెండా ఎగురుతుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు బుధవారం అన్నారు. సికింద్రాబాద్ లోకసభ నియోజకవర్గ స్థాయి సన్నాహక కార్యక్రమంలో మాట్లాడారు. ఈసారి సికింద్రాబాద్లో బీజేపీ ఘోరంగా ఓడిపోవడం ఖాయమని చెప్పారు.
షాకింగ్: 'జగన్ కోసం రూ.2000 కోట్ల ఫండింగ్!, ప్రతిగా కేసీఆర్ ఏం తీసుకున్నారంటే?'
బీజేపీని ఘోరంగా ఓడిస్తాం
బీజేపీ తెలంగాణ చీఫ్ లక్మణ్ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని, ఆయనకు ఒక్కటే చెబుతున్నానని, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ఇలాగే మాట్లాడారని, అప్పుడు ఘోరంగా ఓడిపోయారన్నారు. ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని తెలిపారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ ఒకటే సీటు గెలిచిందన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల నుంచి మొదలుకుంటే అన్ని ఎన్నికల్లో బీజేపీ ఘోరంగా ఓడిపోయిందన్నారు. మీరు ఏమనుకున్నా, ఏం చేసినా గ్రేటర్, అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించినట్లుగా రేపు సికింద్రాబాద్ లోకసభ నియోజకవర్గంలోను ఓడిస్తామన్నారు.
దత్తాత్రేయను బీజేపీ అవమానించింది
సికింద్రాబాద్ లోకసభ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బండారు దత్తాత్రేయకు మంత్రి పదవి ఇచ్చి సంవత్సరం తర్వాత మంత్రి పదవి నుంచి తొలగించారని, దత్తాత్రేయను మంత్రి పదవి నుంచి ఎందుకు తొలగించారో చెప్పలేదని కేటీఆర్ అన్నారు. దత్తాత్రేయకు సరైన గౌరవం ఇవ్వలేదని, కేంద్ర కేబినెట్లో తెలంగాణ బిడ్డకు అవకాశమివ్వకుండా బీజేపీ అవమానించిందని వ్యాఖ్యానించారు. ఏం చేశాడని మోడీ ఓట్లు అడుగుతున్నారని ప్రశ్నించారు. పన్నుల్లో రావాల్సిన వాటా తప్ప మనకు ఏమీ ఇవ్వలేదని, బీజేపీ నాయకులు ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారని నిలదీశారు.
తెలంగాణలో కలపమని మహారాష్ట్ర వాసులు చెబుతున్నారు
తెరాసకు పదహారు సీట్లు ఇస్తే ఏం చేస్తారని లక్ష్మణ్ వంటి నాయకులు అడుగుతున్నారని, ఇద్దరు ఎంపీలతో రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్.. అదే 16 మందిని గెలిపిస్తే ఢిల్లీ మెడలు వంచుతారన్నారు. కేసీఆర్ నాయకత్వం దేశానికి ఆదర్శంగా నిలిచిందని, కాంగ్రెస్, బీజేపీలు దేశాన్ని డెబ్బై ఏళ్లు పాలించాయని, ఇంకా దేశంలో విద్యుత్, నీళ్లు, రహదారుల్లేని గ్రామాలు ఉన్నాయని, మహారాష్ట్రలోని ప్రజలు తెలంగాణలో కలుస్తామని చెబుతున్నారని, ముధోల్ తాలుకాను ఆనుకోని ఉన్న మహారాష్ట్ర శాసన సభ నియోజక వర్గంలోని 40 గ్రామాల సర్పంచులు తమ ప్రాంతాన్ని ముధోల్లో కలపమని తీర్మానం చేశారన్నారు.