పోటీ చేస్తామని టిడిపి, కాంగ్రెస్ను ముంచి, కారు ఎక్కారు: మెదక్, అదిలాబాద్లు టిఆర్ఎస్ వశం
అదిలాబాద్/మెదక్: స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల తరఫున బరిలోకి దిగిన అభ్యర్థులో తమ తమ పార్టీలకు శుక్రవారం నాడు గట్టి ఝలక్ ఇచ్చారు. అదిలాబాద్ జిల్లాలో టిడిపి అభ్యర్థి నారాయణ రెడ్డి, మెదక్లో కాంగ్రెస్ అభ్యర్థి శివరాజ్ పాటిల్లు టిఆర్ఎస్లో చేరారు.
ఇప్పటికే వరంగల్ స్థానిక సంస్థల ఎన్నిక ఏకగ్రీవం అయింది. అయిదుగురు స్వతంత్రులు తప్పుకోవడంతో కొండా మురళీ ఏకగ్రీవం కానున్నారు. తాజాగా, అదిలాబాద్, మెదక్ జిల్లాల్లోను టిఆర్ఎస్ ఏకగ్రీవం కానుంది. ఈ రెండు జిల్లాల్లో విపక్షాలు పోటీ నుంచి తప్పుకున్నాయి.
మరో షాకింగ్ ఏమంటే... కాంగ్రెస్, టిడిపి అభ్యర్థులు కారు ఎక్కడం. అదిలాబాద్ జిల్లాలో తెలంగాణ టీడీపీకి నమ్మక ద్రోహం జరిగింది. పార్టీలో ఉంటూ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ టిక్కెట్ పొందిన నారాయణ రెడ్డి చివరి నిమిషంలో గులాబీ గూటికి చేరిపోయారు.
తెలంగాణ టీడీపీ బీఫారంతోనే నామినేషన్ వేసిన ఆయన చివరి క్షణంలో తన నామినేషన్ను ఉపసంహరించుకున్నారు. దీంతో టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన పురాణం సతీశ్ ఏకగ్రీవం కానున్నారు. నామినేషన్ ఉపసంహరించుకున్న మరుక్షణం నారాయణ రెడ్డి కారు ఎక్కారు.
మరోవైపు, కాంగ్రెస్ పార్టీని కూడా మెదక్ జిల్లా అభ్యర్థి శివరాజ్ పాటిల్ నిండా ముంచారు. ఆయన బరి నుంచి తప్పుకొని, కారు ఎక్కారు. దీంతో మెదక్ ఎమ్మెల్సీ స్థానం టీఆర్ఎస్ వశమైంది. స్థానిక సంస్థల కోటాకింద జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ నుంచి భూపాల్ రెడ్డి అభ్యర్థిగా బరిలో నిలిచారు.
టీడీపీ నుంచి బాల్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుంచి శివరాజ్ పాటిల్ నామినేషన్లను దాఖలు చేశారు. వీరిద్దరు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. శివరాజ్ పాటిల్ నామినేషన్ ఉపసంహరణ అనంతరం టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన గులాబీ కండువా కప్పుకున్నారు.