పాలేరులో టిఆర్ఎస్, అసోంలో బీజేపీ రికార్డ్: సంబరాలు (పిక్చర్స్)
హైదరాబాద్: ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నికల్లో తెరాస అభ్యర్థి తుమ్మల నాగేశ్వర రావు ఘన విజయం సాధించారు. భారీ మెజారిటీ ప్రజలు పట్టం గట్టారు. పాలేరు ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి రాంరెడ్డి సుచరితా రెడ్డిపై తుమ్మల 45,682 ఓట్ల మెజారిటీతో గెలిచారు.
2014 ఎన్నికల్లో 21 వేల మెజారిటీ సాధించిన కాంగ్రెస్, ఈ ఉప ఎన్నికలో ఘోర పరాజయం పాలైంది. ఉప ఎన్నికలో 1,71,074 ఓట్లు పోలవగా టీఆర్ఎస్కు 94,940 ఓట్లు, కాంగ్రెస్కు 49,258, సీపీఎంకు 15,538, నోటాకు 2,785 ఓట్లు పడ్డాయి.
డిపాజిట్ దక్కాలంటే కనీసం 28,512 ఓట్లు రావాల్సి ఉంటుంది. సీపీఎంకు కేవలం 15,538 ఓట్లు రావడంతో డిపాజిట్ గల్లంతైంది. పాలేరు గెలుపుపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. పాలేరు ఫలితాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వ రెండేళ్ల పాలనపై ప్రజలిచ్చిన తీర్పుగా భావిస్తున్నామన్నారు.
పాలేరు గెలుపు
రెండేళ్ల సీఎం కేసీఆర్ పాలనకు పాలేరు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. చరిత్రను తిరుగరాస్తూ తీర్పు చెప్పారు. ఏళ్ల తరబడి వెనుకబడిన ప్రాంతంలో మార్పును ప్రజలు కోరుకున్నారు.
పాలేరు గెలుపు
గత సార్వత్రిక ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో ప్రభావం చూపని టీఆర్ఎస్, ఇప్పుడు అత్యధిక మెజార్టీ తో పాలేరులో విజయదుందుభి మోగించింది.
పాలేరు గెలుపు
తుమ్మల రికార్డు మెజారిటీతో విజయం సాధించడంతో జిల్లావ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు పెద్దఎత్తున సంబరాలు చేసుకున్నారు. పటాకులు కాల్చి స్వీట్లు పంచుకున్నారు.
పాలేరు గెలుపు
ఖమ్మం టీఆర్ఎస్ కార్యాలయంలో, హైదరాబాద్ కార్యాలయంలో నేతలు, కార్పోరేటర్లు విజయోత్సవాలు నిర్వహించారు.
పాలేరు గెలుపు
ఖమ్మంలో మంత్రి తుమ్మల నాగేశ్వర్రావును భుజాలపై ఎత్తుకుని నృత్యాలు చేశారు. ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద జెడ్పీ చైర్పర్సన్ గడిపల్లి కవిత, మేయర్ గుగులోత్ పాపాలాల్, డిప్యూటీ మేయర్ బత్తుల మురళీప్రసాద్, కార్పొరేటర్లు, టీఆర్ఎస్ ఖమ్మం ఇన్చార్జి ఆర్జేసీ కృష్ణ తదితరులు సంబరాల్లో పాల్గొన్నారు.
పాలేరు గెలుపు
పటాకులు కాల్చి జై కేసీఆర్.. జై తుమ్మల.. జై తెలంగాణ నినాదాలు చేశారు. ఖమ్మం నగరంలో టీఆర్ఎస్ కార్యకర్తలు విజయోత్సవ ర్యాలీలు నిర్వహించారు.
పాలేరు గెలుపు
హైదరాబాదులోని తెలంగాణ భవన్లోను పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. మహిళలు డ్యాన్సు చేసి ఆనందాన్ని పంచుకున్నారు. టపాసులు పేల్చారు.
అసోం బీజేపీ గెలుపు సంబరాలు హైదరాబాదులో..
అసోంలో బీజేపీ గెలుపు నేపథ్యంలో హైదరాబాదులో సంబరాలు చేసుకున్నారు. బీజేపీ కార్యాలయంలో నేతలు మిఠాయిలు పంచుకున్నారు. డ్యాన్సు చేశారు. కేరళలో కమల వికాసం, అసోంలో గెలుపుపై బీజేపీ నేతలు కార్యాలయంలో మాట్లాడారు.
అసోం బీజేపీ గెలుపు సంబరాలు హైదరాబాదులో..
అసోంలో బీజేపీ తొలిసారి పాగా వేసింది. గిరిజన ఓటర్లపై ఆకర్షణ మంత్రం ఫలించింది. ముస్లింలకు వ్యతిరేకం కాదనే ప్రచారం కట్టిపడేసింది. ఈశాన్య రాష్ట్రాల ముఖద్వారంలో ఘన విజయంతో అడుగు మోపింది.
అసోం బీజేపీ గెలుపు సంబరాలు హైదరాబాదులో..
యువనేతను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించటం దగ్గర నుంచి రాష్ట్ర ప్రజల భావోద్వేగాలను పసిగట్టి వ్యవహరించటం వరకు కొత్త ఎత్తుగడలు వేస్తూ, చిరకాల లక్ష్యాన్ని బీజేపీ సాధించింది.
అసోం బీజేపీ గెలుపు సంబరాలు హైదరాబాదులో..
ప్రభుత్వ వ్యతిరేకత, అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతున్న పదిహేనేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మట్టి కరిపించి అధికార పీఠాన్ని చేజిక్కించుకుంది. ఈ విజయంతో కాంగ్రెస్ విముక్త దేశ లక్ష్యం దిశగా మరో ముందడుగు వేసింది.
అసోం బీజేపీ గెలుపు సంబరాలు హైదరాబాదులో..
అసోంలో 89 సీట్లలో పోటీచేసిన బీజేపీ సొంతంగానే సాధారణ మెజార్టీకి దాదాపు చేరువకు చేరుకుంది. 2011 ఎన్నికల్లో కేవలం ఐదు సీట్లతోనే సరిపెట్టుకున్న బీజేపీ ఈసారి ఏకంగా 60 సీట్లను సొంతగా గెలుచుకుంది.
అసోం బీజేపీ గెలుపు సంబరాలు హైదరాబాదులో..
మిత్రపక్షాలైన ఏజీపీ (14), బీపీఎఫ్ (12) పార్టీలతో కలిసి మూడింట రెండొంతుల మెజార్టీని సొంతం చేసుకుంది. బీజేపీ కూటమి మొత్తం 126 స్థానాల్లో 86 సీట్లు గెలుచుకుని ఈశాన్య భారతాన కాషాయాన్ని విరబూయించింది.
అసోం బీజేపీ గెలుపు సంబరాలు హైదరాబాదులో..
బీజేపీ కూటమి హవాకు కాంగ్రెస్ చిత్తయ్యింది. 2011లో 79 సీట్లతో అధికారాన్ని కైవసం చేసుకున్న కాంగ్రెస్ ఈసారి 26 స్థానాలకే పరిమితమైంది.
అసోం బీజేపీ గెలుపు సంబరాలు హైదరాబాదులో..
ప్రధాన ప్రతిపక్షంగా కొనసాగిన ఆలిండియా యునైటెడ్ డెమోక్రాటిక్ ఫ్రంట్ (ఏఐయూడీఎఫ్) సైతం 13 స్థానాలకు పడిపోయింది.